హైదరాబాద్, వెలుగు: ఏడాదిన్నరగా గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్, మెంబర్లు లేకపోవటంతో ట్రిబ్యునల్లో ఎలాంటి వర్క్ జరగటం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి అన్నారు. దీంతో వెంటనే చైర్మన్, మెంబర్లను నియమించాలని కోరుతూ గురువారం కేసీఆర్కు లేఖ రాశారు. జీపీ పాలనలో నిధులు, విధులలో అలసత్వం ప్రదర్శిస్తే సర్పంచ్, ఉప సర్పంచ్లను కలెక్టర్లు సస్పెండ్ చేస్తున్నారని, అప్పుడు లోకల్ బాడీ నేతలు ట్రిబ్యునల్ను అశ్రయిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ట్రిబ్యునల్ను ఆశ్రయించిన తర్వాత 3 నెలల్లో ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులు విచారించి తీర్పు ఇస్తున్నారని చెప్పారు. ట్రిబ్యునల్ను ఆశ్రయించాలంటే ఫీజును రూ.25 వేలుగా ఖరారు చేశారని, దీనిని రూ.1,000కి తగ్గించాలని కోరారు.