అదృష్టం అంటే ఇదే.. తెలంగాణ వ్యాప్తంగా ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచులు వీళ్లే

అదృష్టం అంటే ఇదే..  తెలంగాణ వ్యాప్తంగా ఒక్క ఓటుతో గెలిచిన సర్పంచులు వీళ్లే

సర్పంచ్ ఎన్నికల్లో  గెలిచిన వారు సంబరాల్లో మునిగితే.. పదవి దక్కని వారు లక్​ కలిసి రాలేదని వాపోతున్నారు. కేవలం ఒక్క ఓటు ఎక్కువ రావడంతో గెలిచిన అభ్యర్థులు సంబురపడగా, ఒక్క ఓటు తేడాతో ఓడిన వాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐదారు ఓట్ల తేడాతో పలువురు సర్పంచులుగా గెలిచారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటుతో గెలుపు

హోరాహోరీ పోరులో ఇద్దరికీ సమాన ఓట్లు రాగా, అక్కడ నమోదైన ఒకే ఒక బ్యాలెట్  ఓటుతో విద్యావంతురాలైన యువతి సర్పంచ్ గా ఎన్ని కయ్యారు. నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్  పంచాయతీకి ఆదివారం పోలింగ్ జరగ్గా, ముత్యాల శ్రీవేద, ఆమె ప్రత్యర్థి అర్ష స్వాతికి 180 చొప్పున ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత అధికారులు పోలైన పోస్టల్  బ్యాలెట్  శ్రీవేదకు రావడంతో ఆమె గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

మూడు సార్లు లెక్కించినా .. 

నారాయణపేట జిల్లా మరికల్  మండలం పెద్దచింతకుంటలో కాంగ్రెస్  మద్దతుతో పోటీ చేసిన తిరుపతమ్మకు 605 ఓట్లు రాగా, బీఆర్ఎస్​ మద్దతుతో పోటీ చేసిన పద్మమ్మకు 604 ఓట్లు వచ్చాయి. దీంతో పద్మమ్మపై తిరుపతమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్  మద్దతుదారులు రీ కౌంటింగ్ చేయాలని కోరగా, ఎన్నికల సిబ్బంది మూడు సార్లు రీ కౌంటింగ్  చేశారు. మూడు సార్లు కూడా ఒక్క ఓటు మెజార్టీనే వచ్చింది.

రీ కౌంటింగ్​లో .. 

మహబూబ్​నగర్  జిల్లా చిన్నచింతకుంట మండలం గూడూరు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్​  మద్దతుతో శేఖర్, కాంగ్రెస్​ రెబల్​గా భీమన్న గౌడ్  పోటీ చేశారు. వీరిద్దరికీ మొదట 280 చొప్పున ఓట్లు వచ్చాయి. ఆఫీసర్లు టైగా ప్రకటించి, టాస్  వేసి విజేతను ప్రకటిస్తామని చెప్పారు. అయితే ఇద్దరు క్యాండిడేట్లు ఇందుకు ఒప్పుకోలేదు. రీ కౌంటింగ్  చేయాలని డిమాండ్  చేశారు. రీకౌంటింగ్​లో భీమన్నకు ఒక ఓటు ఎక్కువ రావడంతో ఆయన గెలుపొందారు.

ఒక్క ఓటుతో వరించిన విజయం 

  •  వికారాబాద్​ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్​ సర్పంచ్​గా కాంగ్రెస్​ మద్దతుతో పోటీ చేసిన గొల్ల రమాదేవి సమీప అభ్యర్థి మౌనికపై ఒక్క ఓటుతో గెలుపొందారు.
  • రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల సర్పంచ్​గా నక్క బుచ్చిరెడ్డి ఒక్క ఓటుతో ఎన్నికయ్యారు. సమీప ప్రత్యర్థి కాంతారెడ్డిపై ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.
  • నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం ధన్ సింగ్  తండాలో ఒక్క ఓటుతో ధనావత్​ ధూప్ సింగ్ ఒక్క ఓటుతో మెగావత్  భాస్కర్  నాయక్ పై గెలుపొందాడు.
  • కరీంనగర్  జిల్లా శంకరపట్నం మండలం అంబాల్​పూర్  గ్రామ సర్పంచ్ గా వడ్లకొండ వెంకటేశ్​ ఎన్నికయ్యాడు. ప్రత్యర్థి వేగుర్ల ఎల్లయ్యకు 448 ఓట్లు రాగా, వెంకటేశ్​కు 449 ఓట్లు వచ్చాయి.
  • వరంగల్  జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి సర్పంచ్ గా కొంగర మల్లమ్మ గెలిచింది. ఎస్సీ అభ్యర్థులు లేకపోవడంతో ఏకగ్రీవం అవుతుందని భావించినప్పటికీ, అనూహ్యంగా రాయపురం నవ్య శ్రీ నామినేషన్  దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఆదివారం జరిగిన పోలింగ్​లో1,451 ఓట్లు పోలవగా, మల్లమ్మకు 705, నవ్యశ్రీకి 704 ఓట్లు పోలయ్యాయి. మల్లమ్మ ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొంది హ్యాట్రిక్  సాధించగా, స్థానికులు సంబరాలు చేసుకున్నారు. 
  •  ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం మల్లయ్యపల్లిలో జాటోత్​ గణేశ్​ఒక ఓటుతో గెలిచాడు. మొదట రెండు ఓట్లు ఆధిక్యం రావడంతో మరో అభ్యర్థి జర్పుల హేమూ నాయక్​ రీకౌంటింగ్​ కోసం ఆందోళన చేశారు. రీకౌంటింగ్​ చేసిన అనంతరం ఒక ఓటు ఆధిక్యంతో గణేశ్​​గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.