V6 News

పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు

పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
  • పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చాయి. 
  • కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్​పర్ట్​అప్రైజల్​ కమిటీ క్లియరెన్స్​ 
  • జులై 24న జరిగిన కమిటీ 49వ మీటింగ్​ మినిట్స్  రిలీజ్​

హైదరాబాద్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్​పర్ట్​ అప్రైజల్ ​కమిటీ (ఈఏసీ) క్లియరెన్స్​ ఇచ్చింది. జులై 24న నిర్వహించిన ఈఏసీ 49వ మీటింగ్​ మినిట్స్​ గురువారం రిలీజ్​ అయ్యాయి. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ తుది అనుమతులు ఇస్తున్నట్లు అందులో వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులతో పర్యావరణానికి వాటిల్లిన నష్టం అంచనాలను మళ్లీ సమర్పించాలని జూన్​27న నిర్వహించిన మీటింగ్​లో ఆదేశించామని, జులై 24న నిర్వహించిన మీటింగ్​లో రాష్ట్ర ఇరిగేషన్​అధికారులు దీనిపై పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ఇచ్చారని పేర్కొన్నారు. 

ఎన్జీటీ ఆదేశాలతో ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అన్ని పనులను 2021 అక్టోబర్ 31 నుంచి నవంబర్​22 మధ్య నిలిపివేసినట్లు పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​లో రాష్ట్ర ఇరిగేషన్​ అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులతో పర్యావరణానికి రూ.153.70 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తించామన్నారు. కాగా, ఎన్జీటీ ఆదేశాలతో ప్రాజెక్టు పనులు నిలిపి వేసే నాటికి ఖర్చు చేసిన రూ. 21,200 కోట్లలో 0.5 శాతం పెనాల్టీ విధించామని, ఈ లెక్కన రూ.106 కోట్లు అదనంగా చెల్లించాలని ఆదేశించినట్లు ఈఏసీ తన మినిట్స్​లో పేర్కొంది. పెనాల్టీని తెలంగాణ స్టేట్​పొల్యూషన్ ​కంట్రోల్​బోర్డు వద్ద డిపాజిట్​ చేయాలని ఆదేశించామన్నారు. పర్యావరణానికి కలిగించిన నష్టానికి సమానంగా రూ.153.70 కోట్లు ఖర్చు చేసేలా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు ఐదేండ్ల కాలానికి బ్యాంక్​గ్యారంటీ సమర్పించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రారంభించిన ఐదేండ్ల తర్వాత దానివల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడిందనే దానిపై ఇండిపెండెంట్​ఏజెన్సీతో స్టడీ చేయించాలని అందులో సూచించారు. 

నార్లాపూర్​ పనులు 89% పూర్తి

శ్రీశైలం ఫోర్​షోర్​లోని ఎల్లూరు వద్ద ఫస్ట్ పంప్​హౌస్​పనులు 42 శాతం, దానికి ఎగువన నార్లాపూర్​ రిజర్వాయర్​ పనులు 89 శాతం పూర్తి చేశామని ఈఏసీకి ఇచ్చిన పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​లో రాష్ట్ర ఇరిగేషన్​ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉద్దండాపూర్​పంపుహౌస్​ పనులు అతి తక్కువగా 36 శాతమే చేయగా, అతి ఎక్కువగా ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్​వరకు చేపట్టిన కాల్వ పనుల్లో 90 శాతం పూర్తి చేశామన్నారు. మొత్తం 18 ప్యాకేజీలుగా చేపట్టిన ప్రాజెక్టు పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులతో భూ ఆవరణానికి రూ.38.83 కోట్లు, పర్యావరణానికి రూ.115.85 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. మొత్తంగా రూ.153.70 నష్టం జరిగిందని నిర్ధారించారు. సహజ వనరుల పునరుద్ధరణలో భాగంగా ల్యాండ్​ఎన్విరాన్​మెంట్, ఎనర్జీ కన్జర్వేషన్ పునరుద్దరణకు రూ.40.27 కోట్లు, మానవ వనరులకు ఉపయోగకరమైన పనులు చేపట్టేందుకు రూ.40.80 కోట్లు.. మొత్తంగా రూ.153.70 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. హెల్త్​కేర్​కు రూ.3.94 కోట్లు, ఎడ్యుకేషన్​కు రూ.8.47 కోట్లు, శానిటేషన్​కు రూ.1.29 కోట్లు, పర్యావరణ పునరుద్ధరణకు రూ.50.94 కోట్లు.. ఖర్చు చేస్తామని వెల్లడించారు.