మెడికల్ కాలేజీ పనులు అడ్డగింత..భూమికి బదులు భూమి ఇయ్యాలే

మెడికల్ కాలేజీ పనులు అడ్డగింత..భూమికి  బదులు భూమి ఇయ్యాలే
  • వెయ్యి గజాల ప్లాట్ కేటాయించాలి
  • పెద్దూర్ రైతుల డిమాండ్​

రాజన్న సిరిసిల్ల,వెలుగు:  జిల్లా కేంద్రంలో జరుగుతు న్న మెడికల్​ కాలేజీ పనులను పెద్దూర్ రైతులు అడ్డుకున్నారు.   కాలేజీ చుట్టూ నారు పోసుకున్న భూముల్లో మున్సిపల్ అధికారులు ఫెన్సింగ్ కోసం కందకాలు తవ్వారు.  పనులను రైతులు నిలిపివేశారు. 

మెడికల్ కాలేజీ కోసం 50 ఎకరాలు

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ గ్రామంలోని రెండో బైపాస్ రోడ్ పక్కన  మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు. సర్వే నంబర్ 405 లో ఉన్న ప్రభుత్వ భూములను 60 సంవత్సరాల కింద భూమిలేని నిరుపేదలకు పట్టాలు ఇచ్చారు. ఈ భూమిలో రైతులు 60 ఏండ్ల నుంచి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. మంత్రి కేటీఆర్ స్వయంగా రైతులతో మాట్లాడి ఈ భూములను గతేడాది  మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం  తీసుకున్నారు. భూమికి బదులు కమర్షియల్ ఫ్లాట్లు ఇస్తామని,భూమి కోల్పోయిన ప్రతి రైతుకు వెయ్యి గజాల స్థలాన్ని  కాలేజీ సమీపంలో ప్లాటింగ్ చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. మెడికల్ కాలేజీ కోసం 37 ఎకరాలు, హరిత హోటల్ కోసం 10 ఎకరాలను ఆఫీసర్లు  కేటాయించారు.  
  
మున్సిపల్ ఆఫీసర్లను అడ్డుకున్న రైతులు

అయితే కాలేజీ చుట్టూ ఉన్న స్థలంలో రైతులు నారుపోసుకుంటున్నారు. గురువారం  మున్సిపల్ అధి కారులు వచ్చి ఫెన్సింగ్ కోసం నారుపోసుకున్న పొలాల్లో కందకాలు తవ్వారు. దీంతో  అధికారులను రైతులు అడ్డుకున్నారు.   ఒప్పందం ప్రకారం భూమి ఇచ్చాకే ఫెన్సింగ్ చేయాలని అధికారులకు చెప్పారు.