- బ్లూ బుక్ ప్రకారం భద్రత: సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: పీఎం నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆఫీసర్లను ఆదేశించారు. పీఎం టూర్ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును బ్లూబుక్ ప్రకారం అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఈ నెల 5వ తేదీన పీఎం నరేంద్ర మోడీ ముచ్చింతల్, ఇక్రిశాట్ పర్యటన ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో బీఆర్కే భవన్లో సీఎస్ రివ్యూ నిర్వహించారు. వీవీఐపీ పర్యటన సమయంలో కరోనా ప్రొటోకాల్స్ పాటించేలా చూడాలని హెల్త్సెక్రటరీని సీఎస్ ఆదేశించారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్కు ముందే ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయాలన్నారు. పీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్బీ అధికారులను ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలించాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
మొదలు ఇక్రిశాట్కు..
హైదరాబాద్ రానున్న ప్రధాని 5వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్ ను సందర్శించి వార్షికోత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహం ఆవిష్కరించి, జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో రామానుజాచార్య జీవన ప్రయాణం, ఆయన బోధనలకు సంబంధించిన 3డి ప్రజెంటేషన్ మ్యాపింగ్ ప్రదర్శిస్తారు. 108 దివ్య క్షేత్రాల నిర్మాణాలను కూడా పీఎం సందర్శించనున్నారు.