ఈసారి రిపబ్లిక్​డే వేడుకల్లో ఆర్మీ జంట పరేడ్​

ఈసారి రిపబ్లిక్​డే వేడుకల్లో ఆర్మీ జంట పరేడ్​

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కర్తవ్య పథ్​లో ఈ నెల 26న జరిగే రిపబ్లిక్​డే పరేడ్‌లో ఓ ఆర్మీ జంట పాల్గొననుంది. గణతంత్ర దినోత్సవ పరేడ్‌ల చరిత్రలోనే ఇది తొలిసారి. మేజర్ జెర్రీ బ్లేజ్, కెప్టెన్ సుప్రీత సీటీ దంపతులు ఈ ఘనత సాధించబోతున్నారు. అయితే, వీరు వేర్వేరు రెజిమెంట్‌ల నుంచి పాల్గొననున్నారు. కర్నాటకలోని మైసూర్‌కు చెందిన కెప్టెన్ సుప్రీత అక్కడి జేఎస్‌ఎస్ లా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

తమిళనాడులోని వెల్లింగ్టన్‌కు చెందిన మేజర్ బ్లేజ్ బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. జూన్ 2023లో వీరు పెండ్లి చేసుకున్నారు. వేర్వేరు రెజిమెంట్లలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం బ్లేజ్ మద్రాస్ రెజిమెంట్​నుంచి, సుప్రీత ​కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ కంటెంజెంట్‌నుంచి పరేడ్​లో పాల్గొనబోతున్నారు.