
మందమర్రి,వెలుగు: సింగరేణివ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ బారినపడుతున్న కార్మికులు, వారి కుటుంబాలకు ట్రీట్మెంట్ అందించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ విస్తరించిన ఆరు జిల్లాలోని సింగరేణి దవాఖానాల్లో ఇందుకు సంబంధించి ఐసోలేషన్ వార్డులను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం మందమర్రి(రామకృష్ణాపూర్), బెల్లంపల్లి, గోదావరిఖని, భూపాలపల్లి, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో సింగరేణి దవాఖానలున్నాయి. ఆయా చోట్ల ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా దాదాపు 44వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 20వేల మంది కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.
సింగరేణిలో విస్తరిస్తున్న కరోనా..
సింగరేణి విస్తరించిన భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాల్లో ఇటీవల కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కార్మికులతో పాటు వారి కుటుంబాల్లోనూ టెన్షన్ మొదలైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శాంతిఖని బొగ్గు గనిలో 9మంది కార్మికులకు కరోనా పాజిటివ్ రావడంతో తమకు, తమ కుటుంబసభ్యులకు పూర్తిస్తాయి టెస్టులు చేస్తేనే డ్యూటీలకు వస్తామని ఆందోళనకు దిగారు. మరోవైపు వివిధ వైద్య పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి, శ్రీరాంపూర్ ఏరియా కార్మికులకు కరోనా వైరస్ సోకిందనే కారణంతో కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందించకుండా బలవంతంగా ఇండ్లకు వెళ్లగొడుతున్నారు. దీంతో కార్మిక కుటుంబాలు లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్దవాఖానల్లో వైద్యం చేసుకుంటున్నారు. గోదావరిఖనిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసే ఆఫీసర్ మూడు రోజులు అక్కడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందగా కరోనా పాజిటివ్గా తేలింది. పోతన కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు కరోనా పాజిటివ్తో హైదారబాద్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరికొందరికి కూడా కరోనా వైరస్ సోకింది. వీరికి మొదటి దశలో సింగరేణి ఏరియా ఆసుపత్రిలోనే చికిత్సచేశారు. ఈక్రమంలో సింగరేణి డాక్టర్లు, సిబ్బంది తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోనని భయపడ్డారు. ఒక దశలో రక్షణ కల్పించాలంటూ గోదావరిఖనిలో ఆందోళనకు కూడా దిగారు. కరోనా కంట్రోల్ కోసం రాష్ట్రప్రభుత్వానికి రూ.40కోట్ల విరాళం ప్రకటించిన సింగరేణి యాజమాన్యం, కార్మికులకు చికిత్స అందించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో కార్మికులు, ఉద్యోగులకు సింగరేణి దవాఖానల్లో వైద్యం అందించాలని, ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం కార్మికులు, వారి కుటుంబాలకు ట్రీట్మెంట్ అందించేందుకు సింగరేణి దవాఖానాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఐసోలేషన్ కేంద్రాలివీ..
సింగరేణి వ్యాప్తంగా మూడు రీజియన్లలో ఐసోలేషన్ సెంటర్లను యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. గోదావరిఖనిలో 100 బెడ్స్, బెల్లంపల్లిలో 120 , కొత్తగూడెంలో 40, మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో 20 బెడ్స్, భూపాలపల్లి ఏరియాలో 20బెడ్స్ సామర్థ్యం ఐసోలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సర్కారు ఆదేశాలతో పూర్తిస్థాయి ఐసోలేషన్ సెంటర్గా వినియోగిస్తున్నారు. అక్కడి కార్మికులు, వారి కుటుంబాలకు సాధారణ చికిత్సల కోసం టెంపరరీ ఆసుప్రతిని సైతం అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్- 19 చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. రిజిస్ర్టేషన్ సెంటర్, ఓపీ, ఫార్మా కౌంటర్, సానిటరీ స్టాఫ్, ఐసీయూ/క్లిటికల్ కేర్, లేబర్రూం, ఆపరేషన్ థియేటర్, వార్డులు, కోవిడ్ ఐసోలేషన్ వార్డులు, లాబొరెటరీ, బ్లడ్ బ్యాంకు, రెడీయోలజీ, కిచెన్, పర్మనాలజిస్ట్, ఆఫీస్, హౌజ్కీపింగ్, సివిల్, ఎలక్ర్టికల్, ఇతర సెక్యూరిటీ సిబ్బంది అవసరాన్ని బట్టి ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్లు, ఫేస్షీల్డ్, ఎన్-95 మాస్క్, లేటెక్స్ గ్లౌజ్లు, ఫుల్ పీపీఈ కిట్లు వాడుతామని ఆఫీసర్లు చెబుతున్నారు. కోవిడ్ వార్డుల్లో సేవలందించే వైద్య సిబ్బందికి వారంలో మూడు రోజులే డ్యూటీలు అప్పగించాలని, మిగితా రోజులు రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సింగరేణి సీఎంవో ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సింగరేణి వ్యాప్తంగా ఐసోలేషన్ సెంటర్లకు ప్రపోజల్స్ చేసిన ఆసుపత్రులను సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్,పా) ఎస్.చంద్రశేఖర్, సింగరేణి సీఎంవో మంతా శ్రీనివాస్ సందర్శించి అక్కడి పరిస్థితులు, సదుపాయాలపై డాక్టర్లు, స్థానిక ఏరియా మేనేజర్లతో చర్చించారు.
ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలను కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి ఆసుపత్రుల్లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తాం. అవసరమైన మందులను కొనుగోలుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. కోవిడ్ సర్క్యూలర్ నిబంధనల మేరకు డాక్టర్లు, వైద్య సిబ్బందికి నిబంధనలు వర్తింపజేసేలా కృషి చేస్తాం.
– ఎస్.చంద్రశేఖర్, సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్, పా)