ఇక సింగరేణి దవాఖానాల్లో కరోనా ట్రీట్​మెంట్

ఇక సింగరేణి దవాఖానాల్లో  కరోనా ట్రీట్​మెంట్

మందమర్రి,వెలుగుసింగరేణివ్యాప్తంగా కరోనా​ విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్​ బారినపడుతున్న కార్మికులు, వారి కుటుంబాలకు ట్రీట్​మెంట్ అందించేందుకు  యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది.  కంపెనీ విస్తరించిన ఆరు జిల్లాలోని సింగరేణి దవాఖానాల్లో ఇందుకు సంబంధించి ఐసోలేషన్​ వార్డులను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం మందమర్రి(రామకృష్ణాపూర్​), బెల్లంపల్లి, గోదావరిఖని, భూపాలపల్లి, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం ప్రాంతాల్లో సింగరేణి దవాఖానలున్నాయి. ఆయా చోట్ల ఐసోలేషన్​ సెంటర్ల ఏర్పాటు ద్వారా దాదాపు 44వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు​, 20వేల మంది కాంట్రాక్టు కార్మికులు, వారి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.

సింగరేణిలో  విస్తరిస్తున్న కరోనా​..

సింగరేణి విస్తరించిన భూపాలపల్లి, శ్రీరాంపూర్​, మందమర్రి, మంచిర్యాల ప్రాంతాల్లో ఇటీవల కరోనా విజృంభిస్తోంది.  రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య  పెరుగుతుండడంతో కార్మికులతో పాటు వారి కుటుంబాల్లోనూ టెన్షన్​ మొదలైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శాంతిఖని బొగ్గు గనిలో 9మంది కార్మికులకు కరోనా పాజిటివ్​ రావడంతో తమకు, తమ కుటుంబసభ్యులకు పూర్తిస్తాయి టెస్టులు చేస్తేనే డ్యూటీలకు వస్తామని ఆందోళనకు దిగారు. మరోవైపు వివిధ వైద్య పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న  కార్మికులు కరోనా బారిన పడుతున్నారు.  ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి, శ్రీరాంపూర్​ ఏరియా కార్మికులకు కరోనా వైరస్​ సోకిందనే కారణంతో కార్పొరేట్​ హాస్పిటల్స్​​లో వైద్యం అందించకుండా బలవంతంగా ఇండ్లకు వెళ్లగొడుతున్నారు. దీంతో కార్మిక కుటుంబాలు లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్​దవాఖానల్లో వైద్యం చేసుకుంటున్నారు. గోదావరిఖనిలో ఎగ్జిక్యూటివ్​ ఇంజనీర్​గా పనిచేసే ఆఫీసర్​ మూడు రోజులు అక్కడి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందగా కరోనా పాజిటివ్​గా తేలింది. పోతన కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు కరోనా పాజిటివ్​తో హైదారబాద్​లో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరికొందరికి కూడా కరోనా వైరస్​ సోకింది. వీరికి మొదటి దశలో సింగరేణి ఏరియా ఆసుపత్రిలోనే చికిత్సచేశారు. ఈక్రమంలో సింగరేణి డాక్టర్లు, సిబ్బంది తమకు ఎక్కడ వైరస్​ సోకుతుందోనని భయపడ్డారు. ఒక దశలో రక్షణ కల్పించాలంటూ గోదావరిఖనిలో  ఆందోళనకు కూడా దిగారు. కరోనా కంట్రోల్​ కోసం రాష్ట్రప్రభుత్వానికి రూ.40కోట్ల విరాళం ప్రకటించిన సింగరేణి యాజమాన్యం, కార్మికులకు చికిత్స అందించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో కార్మికులు, ఉద్యోగులకు  సింగరేణి  దవాఖానల్లో వైద్యం అందించాలని, ఐసోలేషన్​ వార్డులను ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.  దీంతో యాజమాన్యం  కార్మికులు, వారి కుటుంబాలకు ట్రీట్​మెంట్​ అందించేందుకు సింగరేణి దవాఖానాల్లో ఐసోలేషన్​ వార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఐసోలేషన్ కేంద్రాలివీ..

సింగరేణి వ్యాప్తంగా మూడు రీజియన్​లలో ఐసోలేషన్​ సెంటర్లను యాజమాన్యం ఏర్పాటు చేస్తోంది. గోదావరిఖనిలో 100 బెడ్స్​, బెల్లంపల్లిలో 120 , కొత్తగూడెంలో 40, మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఏరియా ఆసుపత్రిలో 20 బెడ్స్​, భూపాలపల్లి ఏరియాలో 20బెడ్స్​ సామర్థ్యం ఐసోలేషన్​ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని  సర్కారు ఆదేశాలతో పూర్తిస్థాయి ఐసోలేషన్​ సెంటర్​గా వినియోగిస్తున్నారు. అక్కడి కార్మికులు, వారి కుటుంబాలకు సాధారణ చికిత్సల కోసం టెంపరరీ ఆసుప్రతిని సైతం అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్-​ 19 చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. రిజిస్ర్టేషన్​ సెంటర్​, ఓపీ, ఫార్మా కౌంటర్​, సానిటరీ స్టాఫ్​, ఐసీయూ/క్లిటికల్​ కేర్​, లేబర్​రూం, ఆపరేషన్​ థియేటర్​, వార్డులు, కోవిడ్​ ఐసోలేషన్​ వార్డులు, లాబొరెటరీ, బ్లడ్​ బ్యాంకు, రెడీయోలజీ, కిచెన్, పర్మనాలజిస్ట్​, ఆఫీస్​, హౌజ్​కీపింగ్​, సివిల్​, ఎలక్ర్టికల్​, ఇతర సెక్యూరిటీ సిబ్బంది అవసరాన్ని బట్టి ట్రిపుల్​ లేయర్​ మెడికల్​ మాస్క్​లు, ఫేస్​షీల్డ్​, ఎన్-95 మాస్క్​, లేటెక్స్​ గ్లౌజ్​లు, ఫుల్​ పీపీఈ కిట్లు వాడుతామని ఆఫీసర్లు చెబుతున్నారు.  కోవిడ్​ వార్డుల్లో సేవలందించే వైద్య సిబ్బందికి వారంలో మూడు రోజులే డ్యూటీలు అప్పగించాలని, మిగితా రోజులు రెస్ట్​ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సింగరేణి సీఎంవో ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సింగరేణి వ్యాప్తంగా ఐసోలేషన్​ సెంటర్లకు ప్రపోజల్స్​ చేసిన ఆసుపత్రులను సింగరేణి డైరెక్టర్​(ఆపరేషన్స్​,పా) ఎస్.చంద్రశేఖర్​, సింగరేణి  సీఎంవో మంతా శ్రీనివాస్​ సందర్శించి అక్కడి పరిస్థితులు, సదుపాయాలపై డాక్టర్లు, స్థానిక ఏరియా మేనేజర్లతో చర్చించారు.

ఐసోలేషన్​ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం

సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలను కరోనా వైరస్​ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి ఆసుపత్రుల్లో ఐసోలేషన్​ సెంటర్లను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తాం. అవసరమైన మందులను కొనుగోలుకు సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. కోవిడ్ సర్క్యూలర్​ నిబంధనల మేరకు  డాక్టర్లు, వైద్య సిబ్బందికి నిబంధనలు వర్తింపజేసేలా కృషి చేస్తాం.

– ఎస్​.చంద్రశేఖర్, సింగరేణి డైరెక్టర్​ (ఆపరేషన్స్​, పా)