
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని, దాంట్లో భాగంగానే మెదక్ లో గోరక్షకులను అరెస్ట్ చేయించిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అనవసర సెక్షన్లు పెట్టి గోరక్షకులను జైళ్లలో వేస్తున్నారని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతిస్తోందన్నారు.
హిందువులను అవమానపర్చి, అక్రమ కేసులు పెట్టిన బీఆర్ఎస్ గతి ఏమైందో తెలుసు కదా అని హెచ్చరించారు. మెదక్ లో పోలీసులు కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారని, హైకోర్టు ఇచ్చిన తీర్పును పోలీసులు బేఖాతర్ చేస్తున్నారంటూ విమర్శించారు. గోవులను తరలిస్తున్న వాహనాలను గోరక్షకులు ఆపితే వారిని పోలీసులు బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ ఆలోచించాలని, జరిగిన ఘటనపై వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.