
తెలుగు సినిమా నటుల సంఘం ‘మా’ లో విభేదాలు మరోసారి బయట పడ్డాయి. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా, ‘మా’ న్యూ ఇయర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, జయసుధ, మోహన్ బాబు, రాజశేఖర్, పరుచూరి బ్రదర్స్, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సమావేశంలో మాట్లాడిన చిరంజీవి.. సినిమా అసోసియేషన్ ఓ కన్ స్ట్రక్టివ్ గా సాగిపోవాలని, ఏదైనా మంచి జరిగితే మైక్ లో చెప్పాలి.. చెడు ఉంటే చెవిలో చెప్పాలన్నారు. తామంతా ఓ కుటుంబం వంటి వాళ్లమేనని అన్నారు. త్వరలోనే విదేశాల్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందరు హీరోలనూ పిలిపించి, ఓ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి నిధిని పెంచుదామని సూచించారు.
మైక్ లాక్కున్న రాజశేఖర్
తర్వాత పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా ఆయన నుంచి మైక్ ను హీరో రాజశేఖర్ లాక్కోని మాట్లాడుతూ.. నిప్పును ఎంతగా దాచాలని ప్రయత్నించినా, పొగ రాకుండా మానదని వ్యాఖ్యానించడంతో వేదికపై రసాభాస మొదలైంది. ఈ సమయంలో చిరంజీవి… రాజశేఖర్ ను వారించే ప్రయత్నం చేశారు. అయితే చిరంజీవిని ఉద్దేశించి మీరు మాట్లాడేటప్పుడు తాను కల్పించుకోలేదని.. ఇప్పుడు మీరూ కల్పించుకోవద్దన్నారు. మోహన్ బాబు కూడా రాజశేఖర్ ను వారించే ప్రయత్నం చేశారు.. దీంతో రాజశేఖర్ ఆయనపై కూడా ఫైర్ అయ్యారు. ‘వినండి. మీరు అరిచేస్తే ఏదీ జరిగిపోదు. నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి అంటూ మాట్లాడారు. అంతే కాకుండా మా అసోసియేషన్ కారణంగా తన కుటుంబంలో కలతలు చెలరేగాయని, ఆ వత్తిడిలోనే తన కారు ప్రమాదం జరిగిందన్నారు.అందరూ కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వుండాల్సిందని, తానేమీ చిన్న పిల్లాడిని కాదని, ఏ విషయాన్ని అయినా కప్పి పుచ్చాలని చూస్తే ఊరుకోబోమన్నారు. అంతేకాదు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలంటూ వేదికపై ఉన్న వారందరి కాళ్లు మొక్కి… వేదిక దిగి వెళ్లిపోయారు.
ప్రాటోకాల్ పాటించకుండా, మా వివాదస్పద అంశాలపై బహిరంగంగా మాట్లాడిన రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని మా కమిటిని కోరారు చిరంజీవి.
క్షమాపణ చెప్పిన జీవిత
ఆ తర్వాత ఇదే విషయంపై మాట్లాడిన జీవిత… మాలో చాలా సమస్యలున్నాయని ఇది అందరికీ తెలిసన్నారు. తాము కూడా సామాన్యులమేనన్నారు. రాజశేఖర్ మనసులో ఏం ఉంటే అదే మాట్లాడుతారన్న జీవిత.. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వమన్నారు. ఇక్కడ జరిగిన దానికి తాను సారీ చెబుతున్నానని.. అందరం కలిసి ఐక్యం ముందుకెళదామని తెలిపారు.