- రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతుండటంతో సర్కార్ నిర్ణయం
- ఇప్పటికే ప్రభుత్వ ఆఫీసుల్లో సందర్శకులకు నో ఎంట్రీ
- త్వరలో సగం మంది ఉద్యోగులతో డ్యూటీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు మొదలయ్యాయి. సంక్రాంతి తర్వాత ఈ ఆంక్షలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే కరోనా ఆంక్షలను ఈ నెల 20 దాకా పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. పబ్లిక్ ప్లేసుల్లో జనం గూమికూడటం, బహిరంగ సభలపై నిషేధం విధించింది. దశలవారీగా ఈ గైడ్లైన్స్ను పొడిగించడంతో పాటు మరిన్ని ఆంక్షలు పెట్టేందుకు ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
సగం స్టాఫ్తో డ్యూటీలు
సెక్రటేరియట్తో పాటు పలు ప్రభుత్వ కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో సగం మంది సిబ్బందే డ్యూటీలకు వచ్చేలా త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే సెక్రటేరియట్లోని కొన్ని డిపార్ట్మెంట్లలో వారం వారం రోటేషన్ పద్ధతిలో 50శాతం మంది సిబ్బంది మాత్రమే విధులకు హాజరుకావాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రైవేట్ ఆఫీసుల్లోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలైతే ఎండాకాలం పూర్తయ్యేదాకా ఆఫీసులకు పిలిచే చాన్సెస్ కన్పించట్లేదు. ప్రభుత్వ ఆఫీసులలో 50 ఏండ్లు పైబడినోళ్లు ఆఫీసులకు వచ్చేందుకు వెనుకాడుతుండటంతో వారి డ్యూటీలను వేరేవాళ్లకు అప్పగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ఆఫీస్ పనుల మీద ఉద్యోగులు, అధికారులు, జనం హైదరాబాద్లోని సెక్రటేరియట్, పలు ఆఫీసుల హెడ్ క్వార్టర్లకు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుదలతో కొన్ని రోజుల నుంచి ఆఫీసు పనుల కోసం ఇక్కడికి వచ్చేవాళ్ల సంఖ్యా తగ్గింది. అలాగే పలు ప్రభుత్వ ఆఫీసుల్లో విజిటర్స్కు ‘‘నో ఎంట్రీ’’ అనే బోర్డులు కూడా పెట్టారు.
పార్టీ ఆఫీసులు క్లోజ్
కరోనా కేసుల ఎఫెక్ట్ పార్టీ ఆఫీసులకు కూడా తగిలింది. వైరస్ కేసులు పెరుగుతుండటంతో కొన్ని రోజుల పాటు పార్టీ ఆఫీసులు క్లోజ్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ స్టేట్ ఆఫీసును వారం రోజులు బంద్ పెడుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. త్వరలో గాంధీ భవన్, తెలంగాణ భవన్, లోటస్ పాండ్లోని వైఎస్సార్టీపీ ఆఫీసులను కూడా మూసివేయనున్నట్లు తెలుస్తోంది.
2707 కేసులు.. ఇద్దరు మృతి
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 84,280 మందికి పరీక్షలు చేయగా 2,707 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1328, రంగారెడ్డి జిల్లా పరిధిలో 202, మేడ్చల్ జిల్లా పరిధిలో 248 కేసులు ఉండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 929 కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 2 వేల 801కి పెరిగింది. ఇందులో 6 లక్షల 78 వేల 290 మంది కోలుకున్నారు. మరో 20 వేల 462యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో గురువారం ఇద్దరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 4,049కి పెరిగింది.