
గుండెపోటు మరణాలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. 20 ఏండ్ల యువత నుంచి 60 ఏండ్ల వరకు హఠాత్తుగా కుప్పకూలుతున్నారు. ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపించినా ఉన్నట్లుండి గుండెపోటుకు గురవుతున్నారు. ఈ మధ్య కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది గుండెపోటుతో చనిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. గతంలో 50 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూసేవాళ్లం. కరోనా తర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి.
ఆదివారం (జూన్ 1) మహబూబాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఏఎస్సై మృతి చెందడం విషాదాన్ని నింపింది.జిల్లాలోని కేసముద్రం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్సై కృష్ణ మూర్తి ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళనకు గురి చేసింది. డ్యూటీలో ఉండగా సడెన్ గా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఒక్కసారిగా గుండె పట్టేసినట్లు అవ్వడంతో ఎదను పట్టుకుని అలాగే కుప్పకూలిపోయాడు.
డ్యూటీలో ఉన్న ఇతర పోలీసులు సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
నాలుగు రోజుల క్రితం ఇలాంటి మరణమే మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగింది. మే 28న మంచిర్యాల జిల్లా జన్నారంలో కుర్చీలోనే కుప్ప కూలిండు పంచాయతీ సెక్రటరీ. గుండెపోటుతో కుర్చీలోనే ప్రాణాలు విడిచాడు పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి. కుటుంబ సభ్యులతో కుర్చీలో కూర్చోని మాట్లాడుతుండగా గుండెపోటుతో కిందపడిపోయాడు. ఇలాంటి మరణాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.