ఆసిఫాబాద్ ​టికెట్ ఆదివాసికే ఇవ్వాలి.. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఆసిఫాబాద్ ​టికెట్ ఆదివాసికే ఇవ్వాలి.. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఆసిఫాబాద్, వెలుగు:  ఎస్టీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్ కాంగ్రెస్ టికెట్ ను ఆదివాసీ బిడ్డ, దివంగత మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు కూతురు, మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతికే ఇవ్వాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ సరస్వతికే టికెట్ కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కుడ్మెత విశ్వనాథ్ రావు మాట్లాడుతూ ఎస్టీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్ లో 80 వేల మంది ఆదివాసులు ఉన్నారని, తమను అణగదొక్కేందుకు వలసవాదులు వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం వలసవాదులకు టికెట్ ఇస్తే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు.  పార్టీ కోసం ఏండ్లుగా పనిచేస్తున్న సరస్వతికి కాకుండా వలసవాదులకు టిక్కెట్ ఇస్తే ఊర్లలో తిరగనివ్వమన్నారు. ఆదివాసీ నాయకులు సిడం జగన్నాథ్ రావు, కుర్సెంగ నగేశ్, పవన్ కుమార్ పాల్గొన్నారు.