న్యూఢిల్లీ, వెలుగు: దేశ ఆర్థిక వృద్ధికి, ఆహార భద్రతకు, పర్యావరణ సుస్థిరతకు నీరే పునాది అని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, భూగర్భ జలాలు తగ్గిపోవడం, అర్బనైజేషన్ పెరగడం వల్ల సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో మానవ శ్రేయస్సు కోసం శాస్త్రీయ, సమర్థవంతమైన, సుస్థిరమైన నీటి వనరుల నిర్వహణ చేపట్టాలని రాష్ట్రాలకు ఆయన పిలుపునిచ్చారు.
సోమవారం ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లోని చాణక్య హాల్ పాటిల్ అధ్యక్షతన ‘రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖ అత్యున్నత కార్యదర్శుల అఖిల భారత సదస్సు’జరిగింది. తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఈ సదస్సులో పాల్గొన్నారు. డ్యామ్ భద్రతా చట్టం, 2021ను సమర్థవంతంగా అమలు చేయాలని, డ్యామ్ భద్రతా మూల్యాంకనాలను ఈ ఏడాది డిసెంబర్లోపు పూర్తి చేయాలని, జలాశయాల్లో పూడిక తీయాలని పిలుపునిచ్చారు.
