- అస్సాం చరిత్ర తెలియనోళ్లు మాట్లాడొద్దు
- కపిల్ సిబల్ కామెంట్లపై హిమంత బిశ్వ శర్మ ఫైర్
గౌహతి : ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా మండిపడ్డారు. పౌరసత్వ చట్టం, 1955లోని సెక్షన్ 6ఏ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బుధవారం సిబల్ వాదిస్తూ అస్సాం గతంలో మయన్మార్లో భాగమని పేర్కొన్నారు.
“రికార్డులు పరిశీలిస్తే ఎవరు ఎప్పుడు వచ్చారో గుర్తించడం అసాధ్యమని మనకు తెలుస్తున్నది. వాస్తవానికి అస్సాం.. మయన్మార్లో ఒక భాగం. 1824 లో బ్రిటిష్ వారు మయన్మార్లో కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నరు. ఆ తర్వాత కుదిరిన ఒప్పందంలో భాగంగా అస్సాంను బ్రిటీష్ వారికి అప్పగించారు” అని సిబల్ అన్నారు.
ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సిబల్ కామెంట్లను తీవ్రంగా ఖండించారు. ‘‘అస్సాం చరిత్ర గురించి తెలియని వారు మా రాష్ట్రం గురించి మాట్లాడొద్దు. గతంలో ఈ ప్రాంతం గురించి ఘర్షణలు జరిగాయి తప్ప, అస్సాం మయన్మార్లో భాగమని చెప్పే ఎలాంటి సమాచారం ఇంతవరకు చూడలేదు”అని అన్నారు.