
ఆస్తమా పేషెంట్ మృతి పెద్దపల్లి జిల్లా వాసులను ఆందోళనకు గురిచేసింది. జిల్లాలోని కనుకుల గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (28) కరీంనగర్ పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్న ఈయన సంబంధిత నిపుణులైన డాక్టర్ వద్ద చికిత్స పొందుతున్నాడు. శనివారం సాయంత్రం స్వగ్రామమైన కనుకులకు వచ్చిన శ్రీనివాస్రెడ్డి పరిస్థితి ఆదివారం ఉదయం ఆందోళనకరంగా మారింది. కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది ఆయనను పరిశీలించి అనుమానంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే శ్రీనివాస్రెడ్డి మృతి చెందాడు. తహసీల్దార్ హనుమంతరావు, ట్రైనీ ఐపీఎస్ అధికారి రూపేశ్, సీఐ మహేందర్రెడ్డి, వైద్యాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారించారు. శ్రీనివాస్రెడ్డి వాడిన మెడిసిన్స్కు సంబంధించి ప్రిస్క్రిప్షన్లను పరిశీలించారు. వ్యాధి లక్షణాలను తెలుసుకున్నారు. శ్రీనివాస్రెడ్డి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో మృతి చెందినట్టు నిర్ధారించారు. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యుల హాజరుతో అంత్యక్రియలు జరపాలని అధికారులు ఆదేశించారు.