రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన దళిత రైతులపై ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరులు దాడి చేశారు. ముడిగ్యాల గ్రామానికి చెందిన జూకంటి గోపయ్యకు సర్వే నెంబర్ 116లో 15 ఎకరాల పట్టా భూమి ఉన్నది. దశాబ్దాల నుంచి ఇతను సాగు చేసుకుంటున్నాడు. ఆదివారం ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరులు 30 మంది.. రెండు జేసీబీలు తీసుకొచ్చి ఈ భూమి తమదని కబ్జా చేశారు. పంటను దున్నివేయడంతో పాటు.. గోపయ్య కొడుకులు గోవార్దన్, అంజయ్య, కృష్ణలను కర్రలతో విచక్షణా రహితంగా కొట్టారు. ఆడవాళ్లని కూడా చూడకుండా బూతులు తిడుతూ దాడులు చేశారు.
చేవెళ్లకు చెందిన మద్దెల చింటు(నర్సింలు) అనే వ్యక్తి తాను ఎమ్మెల్యే యాదయ్య అనుచరుడిని అని, చేవెళ్ల మార్కెట్ కమిటీకి కాబోయే చైర్మన్ ను అని, అందరిని చంపైనా సరే కబ్జా చేస్తానని హెచ్చరించాడు. బాధిత రైతు గోపయ్య మాట్లాడుతూ.. భూమిపై తనకు, తన సోదరులకు కొన్నేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. వాళ్లు అగ్రిమెంట్ చేసినట్లు ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారని , కోర్టులో కేసు ఉన్న భూమిలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకొని.. తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరాడు.