కానిస్టేబుల్పై దాడి.. తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్

కానిస్టేబుల్పై దాడి.. తెనాలిలో రౌడీ షీటర్ అనుచరులకు అరికాలి కోటింగ్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్

కానిస్టేబుల్ పై దాడి చేశారని యువకులను నడిరోడ్డుపై పోలీసులు శిక్షించడం చర్చనీయాంశంగా మారింది. రౌడీ షీటర్ అనుచరులు కానిస్టేబుల్ పై దాడి చేశారని అరికాలిపై లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. తప్పయ్యిందో సారో.. అని మొత్తుకున్నా కూడా యువకులకు అరికాలి కోటింగ్ ఇవ్వటం గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం సృష్టిస్తోంది. 

నెల రోజుల క్రితం రౌడీ షీటర్ లడ్డూ అనుచరులు ఐతానగర్ లో తనను దాడి చేశారని  కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు చేశాడు.  రౌడీషీటర్ లడ్డూ అనుచరులు అయిన విక్టర్, బాబూలాల్, రాకేష్.. గంజాయి మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేశారని కేసు నమోదైంది. 

కేసు నమోదు చేసిన తెనాలి టూ టౌన్ పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఐతానగర్ తీసుకెళ్లి నడిరోడ్డుపై అరికాలి కోటింగ్ ఇచ్చారు పోలీసులు ఇచ్చారు. అందరూ చూస్తుండగా  నడిరోడ్డుపై కూర్చోబెట్టి.. అరికాళ్లపై లాఠీలతో చితకబాదారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 అయితే ఈ కేసులో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రౌడీ షీటర్ అనుచరులు అకారణంగా దాడికి దిగారని.. కానిస్టేబుల్ కంప్లైంట్ తో పోలీసులు నడిరోడ్డుపై వాళ్లకు బుద్ధి చెప్పారని కొందరు అంటున్నారు.

మరో వాదన ఏంటంటే.. చిరంజీవి అనే కానిస్టేబుల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంటాడు. అయితే 2 టౌన్ పరిధిలోకి వచ్చి యువకులను డబ్బులు ఇవ్వమని అడిగాడని.. ఇవ్వకపోతే అక్రమ కేసులు పెడతానని బెదిరించారని, ఈ క్రమంలోనే వాదన జరిగిందని మరికొందరు చెబుతున్నారు. దీంతో యువకులపై అక్రమ కేసులు పెట్టినట్లు కొందరు చెబుతున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపితే గాని అసలు నిజం బయటపడదు.