వికారాబాద్​ జిల్లాలో టీఆర్​ఎస్​ నేతల దౌర్జన్యం

వికారాబాద్​ జిల్లాలో టీఆర్​ఎస్​ నేతల దౌర్జన్యం

చేవెళ్ల, వెలుగు: పొలం అమ్మడం లేదని వృద్ధ దంపతులపై టీఆర్ఎస్​ ఎంపీటీసీ భర్త, అతని తమ్ముడు తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో జరిగింది. పులుమామిడి గ్రామానికి చెందిన యాదయ్య(73) కు ఊరిలో మూడున్నర ఎకరాల పొలం ఉంది. పులుమామిడి ఎంపీటీసీ భర్త  సోమన్నోళ్ల రామకృష్ణారెడ్డి ఆ పొలాన్ని అమ్మాలంటూ యాదయ్యను అడగగా ఆయన ఒప్పుకోలేదు. ఈ విషయంపై వారి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.  

రామకృష్ణారెడ్డి, అతడి తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గతంలో ఒకసారి ఈ విషయంలో యాదయ్యను బెదిరించారు. సోమవారం మధ్యాహ్నం యాదయ్య తన భార్యతో కలిసి పొలానికి వెళ్లారు. పొలం దగ్గరలోని షెడ్డులో ఒంటరిగా ఉన్న ఆ వృద్ధ దంపతులపై రామకృష్ణారెడ్డి తన భార్య, తమ్ముడు శ్రీనివాస్ రెడ్డితో పాటు మరి కొంతమంది కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో బాధితులు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొలం అమ్మడం లేదనే కక్షతోనే ఎంపీటీసీ, ఆమె భర్త రామకృష్ణారెడ్డి వర్గం దాడికి పాల్పడిందని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీతో పాటు ఆమె భర్త రామకృష్ణారెడ్డి, తమ్ముడు శ్రీనివాసరెడ్డి, అతడి భార్యపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.