మెల్బోర్న్: ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్కు ట్రిపుల్ ధమాకా. ఎనిమిది వారాల పాటు సాగిన ఊహాగానాలకు క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం తెరదించింది. తమ దేశంలో టీమిండియా టూర్ను కన్ఫామ్ చేసింది. నిన్నటిదాకా ఒక్క టెస్టు సిరీస్ మాత్రమే ఖాయమైందన్న వార్తలు రాగా.. టీ20, వన్డే, టెస్టు సిరీస్ల సుదీర్ఘ పర్యటన షెడ్యూల్ను రిలీజ్ చేసింది. సీఏ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకం కానున్న ఈ టూర్ ఈ ఏడాది అక్టోబర్ 11న జరిగే ఫస్ట్ టీ20తో షురూ కానుంది. అంతేకాదు కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా నిలిచిపోయిన క్రికెట్ను తిరిగి ప్రారంభించేందుకు సీఏ పూర్తి ప్లాన్ రెడీ చేసుకుంది. ఏకంగా ఆరు నెలల హోమ్ సీజన్ షెడ్యూల్ను అనౌన్స్ చేసింది. ఇండియా సహా ఐదు దేశాలకు ఆసీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆగస్టు 9వ తేదీన జరిగే ఫస్ట్ మ్యాచ్తో ఆసీస్లో ఇంటర్నేషనల్ క్రికెట్ రీస్టార్ట్ కానుంది. ఆపై వెస్టిండీస్తో మూడు టీ20లకు (అక్టోబర్ 4–9) ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇండియా టూర్ మొదలవనుంది. ఇందులో భాగంగా ఇండియా–ఆసీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది. అక్టోబర్ 11న బ్రిస్బేన్లో ఫస్ట్ టీ20 షెడ్యూల్ చేశారు. తర్వాతి రెండు మ్యాచ్లకు కాన్బెరా (అక్టోబర్ 14), అడిలైడ్ (అక్టోబర్ 17) ఆతిథ్యం ఇస్తాయని సీఏ తమ వెబ్సైట్ పేర్కొన్నది.
టీ20 వరల్డ్ కప్ లేనట్టేనా?
ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ అండ్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ప్రకారం ఇండియా–ఆసీస్ టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్కప్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 మధ్య ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. కానీ, తమ హోమ్ సీజన్ షెడ్యూల్లో సీఏ ఈ టోర్నీ గురించి ప్రస్తావించనే లేదు. పైగా, ఇండియాతో టీ20 సిరీస్.. మెగా టోర్నీకి ఒక్క రోజు ముందే ముగిసేలా షెడ్యూల్ చేసింది. దీన్ని బట్టి టీ20 వరల్డ్ కప్ వాయిదా లేదా రద్దవడం ఖాయం అని తెలుస్తోంది. ఇక, టీ20 సిరీస్ తర్వాత కోహ్లీసేన మరోసారి ఆసీస్కు రానుంది. ఈ టూర్లో మొదట నాలుగు టెస్టు సిరీస్ ఆడనుంది. ఇందులో ఫస్ట్ టెస్టు బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 3వ తేదీ నుంచి జరుగుతుంది. రెండో టెస్టులో పింక్ బాల్తో పోటీ పడనుంది. ఈ డేనైట్ మ్యాచ్ను డిసెంబర్ 11 నుంచి 15 వరకు అడిలైడ్లో షెడ్యూల్ చేశారు. లాస్ట్ ఇయర్ బంగ్లాదేశ్తో తొలిసారి డేనైట్ టెస్టులో తలపడ్డ టీమిండియా..ఈ పోరుతో ఫారిన్ గడ్డపై మొదటిసారి పింక్ బాల్తో పోటీ పడనుంది. చివరి రెండు టెస్టులకు మెల్బోర్న్ (డిసెంబర్ 26–30), సిడ్నీ (జనవరి 3 –7) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కరోనా కారణంగా స్టాఫ్కు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థకు ఈ టెస్టు సిరీస్ ఎంతో కీలక కానుంది. దీని ద్వారా సీఏకు 300 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా. టెస్టుల తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొదలవనుంది. వచ్చే ఏడాది జనవరి 12న పెర్త్లో ఫస్ట్ వన్డే ఉంటుంది. మెల్బోర్న్ (జనవరి 15), సిడ్నీ (జనవరి 17)లో చివరి రెండు మ్యాచ్లు నిర్వహించాలని ప్లాన్ చేశారు. కోహ్లీసేన టూర్ ముగిసిన తర్వాత మిథాలీరాజ్ నేతృత్వంలోని ఇండియా మహిళల జట్టు కూడా ఆసీస్ పర్యటనకు వెళ్లనుంది. జనవరి 22 నుంచి 28 వరకు కంగారూలతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
పరిస్థితులు అనుకూలించకపోతే షెడ్యూల్ మార్పు: సీఏ
న్యూజిలాండ్ (జనవరి 26–ఫిబ్రవరి 2), వెస్టిండీస్తో పాటు అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు సిరీస్ (నవంబర్ 21–25) షెడ్యూల్ను కూడా సీఏ ప్రకటించింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే షెడ్యూల్లో మార్పులు జరిగే చాన్సుందని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ చెప్పారు. అదే సమయంలో ఈ ఆస్ట్రేలియన్ సమ్మర్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్లు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. పబ్లిక్, ప్లేయర్స్, సపోర్ట్స్టాఫ్ సేఫ్టీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, గవర్నమెంట్ గైడ్లైన్స్ పాటిస్తామని స్పష్టం చేశారు. ‘గత 140 ఏళ్ల కాలంలో ఎదురైన ప్రపంచ యుద్ధాలు, మాంద్యాలతో పాటు మరెన్నో సవాళ్లను తట్టుకొని నిలబడి నట్టే ఇప్పుడు ఈ కరోనా సంక్షోభ సమయంలో కూడా ఆస్ట్రేలియా క్రికెట్ సజీవంగా ఉంటుంది. మహమ్మారి అంతమైన తర్వాత మరింత డెవలప్ అవుతుంది’ అని రాబర్ట్స్ పేర్కొన్నారు.