మెల్బోర్న్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే) రసవత్తరంగా మొదలైంది. ఇరుజట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 20 వికెట్లు నేలకూలాయి. శుక్రవారం ఆరంభమైన ఈ మ్యాచ్లో.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 45.2 ఓవర్లలో 152 రన్స్కు ఆలౌటైంది. మైకేల్ నీసర్ (35) టాప్ స్కోరర్. పిచ్పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో ఇంగ్లిష్ బౌలర్ల జోష్ టంగ్ (5/45), గస్ అట్కిన్సన్ (2/28) ఆసీస్ లైనప్ను వణికించారు. ఫలితంగా ట్రావిస్ హెడ్ (12), జాక్ వెదరాల్డ్ (10), మార్నస్ లబుషేన్ (6), స్టీవ్ స్మిత్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
ఉస్మాన్ ఖవాజ (29), అలెక్స్ కెరీ (20) ఐదో వికెట్కు 38 రన్స్ జోడించారు. తర్వాత నీసర్, కామెరూన్ గ్రీన్ (17) ఆరో వికెట్కు 52 రన్స్ జత చేసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 29.5 ఓవర్లలో 110 రన్స్కే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), బెన్ స్టోక్స్ (16) ఓ మాదిరిగా ఆడారు. ఆసీస్ పేసర్లు నీసర్ 4, బోలాండ్ 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ ఆట ముగిసే టైమ్కు ఒక ఓవర్లో 4/0 స్కోరు చేసింది. బోలాండ్ (4 బ్యాటింగ్), హెడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరోవైపు బాక్సింగ్ డే టెస్ట్లో ఒకే రోజు 20 వికెట్లు పడటం మరో రికార్డు. ఇప్పటివరకు1998 యాషెస్ మ్యాచ్లో 18 వికెట్లు పడటమే అత్యధికం. 1888 లార్డ్స్లో జరిగిన యాషెస్ టెస్ట్లో ఒకే రోజు 27 వికెట్లు పడటం ఆల్టైమ్ టెస్ట్ రికార్డుగా ఉంది. ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 94,199 మంది హాజరయ్యారు. దాంతో 2015 ఆసీస్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ (93,013) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
