న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ కంపెనీలు కియా, బీఎండబ్ల్యూ, బెంజ్, సిత్రియాన్, వోల్వో, ఆడి, బీవైడీ, పోర్షే, జాగ్వార్ ల్యాండ్రోవర్ వంటివి మనదేశంలో రాబోయే 12 నెలల్లో దాదాపు 21 కొత్త ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ను (పీవీ) లాంచ్చేయనున్నట్టు ఒక రిపోర్ట్ తెలిపింది. దీనివల్ల ఎలక్ట్రిక్ కార్ల వాడకం భారీగా పెరిగే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో వినియోగదారులకు ఎలక్ట్రిక్ వెహికల్స్ను (ఈవీలు) అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ పీవీల వాటా ప్రస్తుతం మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ విక్రయాలలో 2.47 శాతం మించడం లేదని జాటో డైనమిక్స్ తెలిపింది. టాటా మోటార్స్ భారతదేశ ఈవీ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. దీని ఈవీ పోర్ట్ఫోలియోను మరింత విస్తరించాలని యోచిస్తోంది. తమ పోర్ట్ఫోలియోలో ఈవీ సహకారం ఐదేళ్లలో 25 శాతానికి,
2030 నాటికి 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. టాటా మోటార్స్ తన ఈవీ అమ్మకాలను మూడు సంవత్సరాలలో 1,300 యూనిట్ల నుంచి 50వేలకి పెంచుకోగలిగింది. ఈవీ సెగ్మెంట్లో హ్యాచ్బ్యాక్లు, సెడాన్లు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీలు)ను అమ్ముతోంది.
వాటా పెంచుకుంటున్న ఎంజీ..
చైనా కంపెనీ ఎస్ఏఐసీ మోటార్కు చెందిన ఎంజీ మోటార్ ఇండియా కూడా ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం కార్ల విక్రయాలలో 25 శాతానికి పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపింది. ఈ కార్ మేకర్ తన ఎస్యూవీ జెడ్ఎస్ ఈవీ హై-ఎండ్ వేరియంట్ను ఈ నెలలో రూ. 27. 89 లక్షల ధరకు విడుదల చేసింది. ఇదే ఏడాది ఏప్రిల్లో కామెట్ ఈవీని రూ. 7. 98 లక్షలకు విడుదల చేసింది. వర్షాకాలం తర్వాత ఈవీ వెర్టికల్ను మరింత అభివృద్ధి చెస్తామని కంపెనీ పేర్కొంది. రాబోయే పండుగ సీజన్ను క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 13 కంపెనీలు ఇండియాలో ఎలక్ట్రిక్ పీవీలను విక్రయిస్తున్నాయి. 2020లో వీటి సంఖ్య నాలుగే! మారుతి సుజుకి, హోండా, టయోటా, ఫోక్స్వ్యాగన్, స్కోడా ఆటోలు ఇంకా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లోకి రాలేదు. బిలియనీర్ ఎలాన్ మస్క్ టెస్లా భారతదేశంలో కార్లు, బ్యాటరీల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఈవీ తయారీదారు. తన 25 వేల డాలర్ల మోడల్ 2 కారును 2024లో ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఫిస్కర్ కూడా భారత మార్కెట్ కోసం 100 లిమిటెడ్ ఎడిషన్ ఓషన్ ఎస్యూవీలను తయారు చేయనున్నట్టు ప్రకటించింది.