బ్యాడ్మింటన్ ప్లేయర్ల భారీ మోసం..ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లతో ..

బ్యాడ్మింటన్ ప్లేయర్ల భారీ మోసం..ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లతో ..

బ్యాడ్మింటన్ ప్లేయర్లు  కొత్త రకం మోసానికి తెరలేపారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ మోసానికి పాల్పడ్డారు.  క్రీడాకారులు  తమ అసలు  వయస్సును తగ్గించి ..బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఫేక్ డేట్ ఆఫ్ బర్త్  సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ సర్టిఫికెట్లతో వారి కంటే పిన్న వయస్కులతో  పోటీ పడ్డారు. అయితే  తల్లిదండ్రులకు, వారి కోచ్ లకు  తెలిసే ఈ వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది.  హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

బ్యాడ్మింటన్ ప్లేయర్ల వయసుకు సంబంధించిన సమాచారాన్ని సీసీఎస్ పోలీసులకు ఓ అగంతకుడు ఈ ఏడాది మార్చి 29వ తేదీన  లేఖ రాశాడు. లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలు చేశాడు. ఆరుగురు బ్యాడ్మింటన్ ప్లేయర్లు.. తమ అసలు వయస్సును దాచిపెట్టి ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లను బీఏఐకి సమర్పించారని.., తద్వారా తమ కంటే చిన్న వారితో పోటీల్లో పాల్గొంటూ  మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని పేర్కొన్నాడు.  దీనివల్ల నిబంధనలు పాటించిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని  ఆవేదన వ్యక్తం చేశాడు.   ఈ ఆరుగురితో పాటు..దాదాపు 40 మంది బ్యాడ్మింటన్‌ ప్లేయర్ల వయస్సుపై సందేహాలు ఉన్నట్లు  అజ్ఞాత వ్యక్తి  లేఖలో పేర్కొన్నాడు. ఈ ప్లేయర్లంతా 2005–10 మధ్య పుట్టారని..కానీ వారి  డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లకు బదులు  కొందరు డాక్టర్లు ఇచ్చిన ఫేక్  మెడికల్‌ సర్టిఫికెట్లు దాఖలు చేసి.. తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.  క్రీడాకారుల పుట్టిన తేదీ గోల్ మాల్ వ్యవహారంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అనేక మంది  కోచ్‌లు, క్రీడాకారుల  తల్లిదండ్రులు, డాక్టర్లు ఉన్నారని లేఖలో ప్రస్తావించాడు. ఈ లేఖను సిటీ సీసీఎస్ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.  సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రకుమార్‌ నేతృత్వంలో స్పెషల్  బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.  

సీసీఎస్‌ పోలీసులు  ముగ్గురు ప్లేయర్లకు సంబంధించిన  ఆధారాలు కనుగొన్నారు. బీఏఐ జాబితాలో అండర్‌–17లో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌కుమార్‌ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించాడు. పలు టోర్నీల్లో ఆడాడు. అయితే నిజానికి  రోహన్‌  2005 అక్టోబర్‌ 29 తేదీన పుట్టాడని పోలీసులు నిర్ధారించారు. అలాగే అండర్ –17లో  92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్‌ మౌనీష్‌  తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నాడు. కానీ అతను  అసలు 2006 జూన్‌4న పుట్టాడు. ఇక అండర్‌–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్‌ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్‌ 12గా పేర్కొన్నాడు. కానీ అతని నిజమైన పుట్టిన తేదీ 2007 జనవరి 12.

వీరితో పాటు..మరికొందరు ఆటగాళ్లు ఫేక్ సర్టిఫికెట్లు అందజేశారని అనుమానించిన పోలీసులు..దీనిపై తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కు లేఖ రాశారు. 2023 మే 25న ఓ లేఖ (నం.65/పీఈ/క్యాంప్‌/డీసీపీ/డీడీ/సీసీఎస్‌/డీడీ/2023) రాశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీ కోరారు. కానీ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌ ఇప్పటివరకు స్పందించలేదు.