
- గ్రేటర్ పనులకు సంబంధించి అన్ని వివరాలతో సిద్ధం
- రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించిన కమిషనర్
- వారం రోజుల్లో గ్రేటర్ అభివృద్ధిపై సీఎం రివ్యూ ఉండే చాన్స్
హైదరాబాద్, వెలుగు : కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం శాఖల వారీగా సమీక్షలు చేస్తుంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయి చర్చిస్తున్నారు. తమ ప్రభుత్వం తీసుకునే భవిష్యత్ నిర్ణయాలు, విధానాలపై నివేదికలు కోరుతూ.. సీఎం ఆదేశాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రివ్యూ మీటింగ్కు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా ఎదురుచూస్తున్నారు. ఏక్షణమైనా సీఎంవో నుంచి పిలుపు వస్తుందని, అంతా రెడీగా ఉండాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇప్పటికే కిందిస్థాయి అధికారులను అలర్ట్ చేశారు.
అలాగే గ్రేటర్ డెవలప్ మెంట్ పనులపైనా అన్ని వివరాలను కమిషనర్ సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సిటీలో చేపట్టిన కొత్త పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాటితో పాటు రానున్న రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలు తదితర అన్ని అంశాలపై చర్చించే అవకాశం ఉంది. దీంతో బల్దియా అధికారులు కూడా అందుకు తగినట్టుగా ప్రిపేర్ అయినట్లు తెలిసింది.
ఇటీవల బల్దియా కమిషనర్తో పాటు ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ) జియాఉద్దీన్ తదితర ఉన్నతాధికారులు సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు. అదే సమయంలో త్వరలోనే రివ్యూ నిర్వహిద్దామని సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్కు చెప్పడంతో ఆయన ఉన్నతాధికారులను అలర్ట్ చేశారు. సెక్రటేరియట్లో శాఖల వారీగా రివ్యూలు నిర్వహిస్తున్నందున్న వారం రోజుల్లో బల్దియాపైన కూడా సమీక్ష సమావేశం ఉండొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
నిధులపై చర్చించే చాన్స్
బల్దియాలో చేపట్టిన పనులతో పాటు ప్రస్తుత సంస్థ ఆర్థిక స్థితిపై కూడా ముఖ్యమంత్రి చర్చించే చాన్స్ ఉంది. పదేళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో బల్దియా మిగులు బడ్జె
ట్తో ఉంది. గత తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంతో రూ.6 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపైన మేయర్తో పాటు కమిషనర్ ఎవరూ నోరు విప్పలేకపోయారు.
దీంతో ఉద్యోగులకు సైతం జీతాలు టైంకు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి త్వరలో నిర్వహించే రివ్యూలో ఇది కూడా చర్చకు రావొచ్చు. బల్దియాకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చుపై ఆరా తీయొచ్చు. అయితే, జీహెచ్ఎంసీకి స్పెషల్ ఫండ్స్ ఏమైనా ఇచ్చి ఆదుకుంటారా? అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశం తర్వాతనే గ్రేటర్లో ఏయే పనులు చేపట్టాలనే దానిపై క్లారిటీ రానుంది.
వీటిపైనే ప్రధానంగా ఫోకస్..
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం(ఎస్ఆర్డీపీ) ఫస్ట్ఫేజ్లో రూ.5,937 కోట్లతో మొత్తం 47 పనులు చేపట్టారు. ఇందులో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ లో రూ.4,300 కోట్లతో 36 పనులకు అనుమతులు ఇస్తున్నామని ప్రకటించింది. ఈలోపే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. అదేవిధంగా సిటీలో వరదల నివారణకు ఫస్ట్ఫేజ్లో
రూ. 737.45 కోట్లతో 37 నాలా పనులు చేపట్టారు. ఇంకా 6 పనులు కొనసాగుతున్నాయి. రెండేళ్ల కిందట పనులు ప్రారంభించిన వెంటనే గ్రేటర్కు రూ.1000 కోట్లతో దాదాపు 70 నాలాల పనులు చేపట్టాలని సెకండ్ ఫేజ్కు అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. అనుమతులు వస్తాయని అనుకోగా రాలేదు. దీంతో ఆ పనుల ప్రక్రియ ముందుకు సాగలేదు. వీటితో పాటు మిగతా పనులపైనా సీఎంతో భేటీ అయ్యే మీటింగ్లో చర్చకు రావొచ్చు.