దుర్గం చెరువు పార్కు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి : కమిషనర్ ఆర్వీ కర్ణన్

దుర్గం చెరువు పార్కు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలి : కమిషనర్ ఆర్వీ కర్ణన్
  • పార్కును విజిట్​ చేసిన బల్దియా కమిషనర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు : దుర్గం చెరువు పార్కులో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి ఆయన చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మురుగునీటి పైప్ లైన్ మళ్లింపు పనులు వీలైనంత త్వరగా చేసి వాకర్స్ కు ఇబ్బందులు లేకుండా చేయాలని జలమండలి అధికారులను కోరారు.

చెరువును మరింత సుందరీకరించాలన్నారు. సీవరేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను విజిట్​చేశారు. ఎస్ఎన్ డీపీ ద్వారా చేపడుతున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ పనులను పరిశీలించి సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ సహదేవ్ కేశవ్ పాటిల్, ఎస్ఎన్ డీపీ సీఈ  కోటేశ్వర రావు, జలమండలి అధికారులు, లేక్స్ ఈఈ నారాయణ, డిప్యూటీ కమిషనర్లు  పాల్గొన్నారు.

స్ట్రీట్ లైట్ల సమస్య పరిష్కరించండి

సిటీలో స్ట్రీట్ లైట్ల సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం అడిషనల్, జోనల్ కమిషనర్లు, హెచ్ఓడీ లతో స్ట్రీట్ లైట్లు, పూడికతీత, శానిటేషన్,  దోమల నివారణ, ట్యాక్స్​వసూళ్ల  సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. స్ట్రీట్ లైట్ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రాంతాల్లో పర్యటించి సమస్యకి పరిష్కారం చూపాలన్నారు.

కార్పొరేటర్లు, ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని , ఆ ప్రాంతాల్లో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ ఇంజినీర్లు పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. మెన్, మెటీరియల్​కు సంబంధించి జోనల్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. తాను కూడా సమస్య ఉన్నచోట్ల పర్యటిస్తానన్నారు. డీ-సిల్టింగ్ విషయంలో ఆశించిన  స్థాయిలో పనులు జరగలేదని, హైడ్రాతో  జోనల్ కమిషనర్లు సమన్వయం చేసుకొని పనులు చేయాలని ఆదేశించారు.