హైదరాబాద్, వెలుగు: వరద నీటి నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాంపల్లి సెగ్మెంట్లో శానిటేషన్, స్ట్రామ్ వాటర్ నాలా పనులను ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్తో కలిసి ఆయన పరిశీలించారు. ఆగాపురా నాలా కల్వర్ట్, మల్లేపల్లి మహమూద్ హాస్పిటల్ వద్ద నాలా, తాజ్నగర్, జీబ్రా డ్రెయిన్ నాలా వద్ద జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆగాపురా నాలా కల్వర్ట్ వద్ద స్లాబ్ పనులు పూర్తయ్యాయని.. మిగిలిన వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. మహమూద్ హాస్పిటల్ వద్ద నాలా నిర్మాణం.. కింది వైపు ఉన్న స్లమ్ కాలనీ వాసులకు ఇబ్బందిగా మారిందని అధికా రులు చెప్పడంతో అలైన్మెంట్ మార్చి పనులుచేయాలని కమిషనర్ వారికి సూచించారు.బల్కాపూర్ నాలా పనులకు భూసేకరణ పూర్తి చేసి ఆస్తులు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి రిటర్నింగ్ వాల్ను నిర్మించాలన్నారు. ఆయన వెంట ఖైరతాబాద్ జోన్ కమిషనర్ వెంకటేశ్ దోత్రే, ఎస్ఈ రత్నాకర్, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఈఈ లాల్ సింగ్ పాల్గొన్నారు.
ఇన్టైమ్లోనే డేటా ఎంట్రీ పూర్తి చేస్తం
ప్రజా పాలనలో భాగంగా స్వీకరించిన ప్రతి దరఖాస్తుల డేటాను ఇన్టైమ్లోగా ఆన్లైన్లో ఎంట్రీ చేస్తామని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో బేగంపేట, సికింద్రాబాద్ సర్కిళ్లకు సంబంధించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఒక్కో దరఖాస్తు డేటా ఎంట్రీకి ఎంత టైమ్ పడుతోందని ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు.
ప్రజా పాలనలో భాగంగా గ్రేటర్ పరిధిలో అభయహస్తం అప్లికేషన్లు 19 లక్షలకుపైగా రాగా.. రేషన్ కార్డు, ఇతర సమస్యలపై 5 లక్షల 73వేల అప్లికేషన్లు వచ్చినట్లు కమిషనర్ వివరించారు. అందులో ఇప్పటివరకు 6 లక్షల 50 వేల అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తయ్యిందన్నారు. రోనాల్డ్ రాస్ వెంట జోనల్ కమిషనర్ రవికిరణ్, సికింద్రాబాద్, బేగంపేట డిప్యూటీ కమిషనర్లు శంకర్, సుధాంశు తదితరులు పాల్గొన్నారు.