- అప్పుడే పార్టీకి, నాయకత్వానికి మైలేజీ వస్తదని కామెంట్లు
- జనం మనవైపు చూడాలంటే మీటింగులు పెట్టుడు కాదు
- మిలిటెంట్ ఉద్యమాలు చేయాలన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
- తెలంగాణ భవన్లో టీబీజీకేఎస్ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్రంలో భారీ విధ్వంసాలకు పాల్పడాలంటూ ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. పార్టీ చేస్తున్న నిరసన కార్యక్రమాలకు రైతులు వస్తలేరని, జనాన్ని ఆకట్టుకోవాలంటే మిలిటెంట్ తరహా ఉద్యమాలు చెయ్యాలంటూ క్యాడర్ హింసవైపు మళ్లేలా వ్యాఖ్యలు చేశారు. సింగరేణి జీఎం ఆఫీసును తగలబెట్టాలని, అవసరమైతే సింగరేణి భవన్ను కాల్చెయ్యాలని, రైలు పట్టాలు కోసెయ్యాలని, అప్పుడే తమ సంఘానికి, తమ పార్టీకి, తమ లీడర్లకు మైలేజ్ వస్తుందని చెప్పారు.
హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్(తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో వేదికపై హరీశ్రావు, ఇతర పార్టీ ముఖ్య నేతలు ఉండడం గమనార్హం.
బాల్క సుమన్ మాట్లాడుతూ “మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే రైతులు రోడ్ల మీదికి వస్తలేరు. నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించిన్రు.. ఐదుగురే రైతులు వచ్చిన్రు.. 60,70 మంది మనోళ్లే(బీఆర్ఎస్). నిన్న చెన్నూర్లో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారిపై కూర్చున్నం.. నలుగురైదుగురే రైతులు వచ్చిన్రు.. మళ్ల మనోళ్లే 100 మంది ఉన్నరు.. మీటింగులు, సోషల్మీడియా, ప్రెస్మీట్లు కాదు.. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలే.. మందమర్రిలో ఓ ప్రోగ్రామ్ పెట్టున్రి.. జీఎంగాని ఆఫీసు తగలవెడ్దాం.. మా అయితే ఓ నెలరోజులు జైలుకుపోయొద్దాం.. అవసరమైతే సింగరేణి భవన్ను కాలవెట్టున్రి.. అంగడంగడి జేయున్రి.. ఆ ఫీలింగ్ రావాలె.. మన సంఘానికి, మన పార్టీకి, మన నాయకత్వానికి ఓనర్షిప్(మైలేజ్) రావాలే’’ అని రెచ్చగొట్టారు.
‘మన ఏరియాల గన్ని రైల్వే లైన్లున్నయ్.. రైలురోకో పేరుచెప్పి పట్టాలు కోసిపడేయిన్రి.. మహా అయితే 45 రోజులు జైలుకు పోతారేమో.. పొయ్యి రాన్రి.. జైలుకు పొయ్యేస్తే అదో మెడల్ లెక్క ఉంటది.. సీరియస్గా చెప్తున్నా.. పని చేస్తే పైసలు తన్నుకుంట వస్తయ్.. ఒక్కటి కాలవెట్టి చూడు ఎట్ల రావో పైసలు?’ అంటూ సమావేశానికి వచ్చిన పార్టీ నేతలు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులను సుమన్ రెచ్చగొట్టారు.
ప్రజలు, రైతులు పార్టీకి మద్దతివ్వట్లేదు కాబట్టి రాష్ట్రంలో విధ్వంసాలకు ప్లాన్ చేయాలని సుమన్ స్వయంగా చెప్పడం సంచలనంగా మారింది. కేసీఆర్ దత్తపుత్రుడిగా, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సుమన్ విధ్వంసాలకు పిలుపునివ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్లా మారింది.
