జులై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. లక్షలాది భక్తులు వస్తారని అంచనా

జులై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. లక్షలాది భక్తులు వస్తారని అంచనా
  • వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే తలసాని సమీక్ష

పద్మారావునగర్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జులై 1న అమ్మవారి కల్యాణం, 2న రథోత్సవం ఉండడంతో ఏర్పాట్లపై ఆలయం వద్ద శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమ్మవారి కల్యాణానికి నగరం నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

కల్యాణాన్ని అందరూ వీక్షించే విధంగా ఆలయం ముందు ఎల్ఈడీ  స్క్రీన్​లు ఏర్పాటు చేయాలన్నారు. తోపులాట జరగకుండా క్యూ లైన్లలో పటిష్టమైన బారికేడ్లు, తాగునీరు అందించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. ఆలయ పరిసరాల్లో మ్యాన్ హోళ్లు, డ్రైనేజీ లీకేజీ లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్య నిర్వహణ కోసం మూడు షిఫ్ట్ లలో అదనపు సిబ్బంది, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు బందోబస్తు కోసం అదనపు పోలీసు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. 

వాలంటీర్లకు ఫొటో గుర్తింపు కార్డులను అందజేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్, దేవాలయ అధికారులకు సూచించారు. జోగినీలు, శివసత్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, కార్పొరేటర్ సరళ, డీఎంహెచ్ఓ వెంకట్, ఈఈ రవీంద్ర మోహన్, ఇతర శాఖల అధికారులు 
పాల్గొన్నారు.