
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ చేపడ్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై ఒకట్రెండు రోజుల్లోనే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇటీవలే ఏపీ ప్రతిపాదనలు పంపింది.
దానిపై మంగళవారం (june 17) కేంద్ర పర్యావరణ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) మీటింగ్లో చర్చించినట్టు తెలిసింది. ఏపీ ఇచ్చిన ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్ఆర్) పై చర్చించిన కమిటీ.. ఆ మేరకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విస్తరణపై ఇప్పటికీ పర్యావరణ అనుమతులు పెండింగ్లో ఉన్నాయని, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దంటూ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖరాసింది. అయినా కూడా కేంద్రం ఏకపక్షంగా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ చేయబోతున్నట్టు తెలిసింది.
డీపీఆర్ ముందే సమర్పించారా..?
ఈఏసీ మీటింగ్లో ఓ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించాలంటే డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను సమర్పించాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈఏసీ మీటింగ్కు కనీసం 45 రోజుల ముందే డీపీఆర్ను సమర్పించాక.. దాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించిన తర్వాత ఈఏసీలో చర్చిస్తారని అంటున్నాయి.
కానీ, ఇక్కడ మాత్రం ఏపీ ప్రతిపాదనలు పంపిన కొద్ది రోజులకే ఈఏసీలో చర్చించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఎఫ్ఆర్ను ఆమోదించిన తర్వాత డీపీఆర్ను సమర్పించాల్సి ఉంటుందని ఏపీ చెప్తున్నా.. ఇప్పటికే డీపీఆర్ను కేంద్రానికి ఏపీ సమర్పించి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేంద్రం ఈఏసీలో బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై చర్చించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.