బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. టీవోఆర్కు ఒకట్రెండు రోజుల్లో ఆమోదం!

బనకచర్లపై కేంద్రం కీలక నిర్ణయం.. టీవోఆర్కు  ఒకట్రెండు రోజుల్లో ఆమోదం!

హైదరాబాద్​/న్యూఢిల్లీ, వెలుగు:  ఏపీ చేపడ్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై ఒకట్రెండు రోజుల్లోనే టర్మ్స్  ఆఫ్​ రిఫరెన్స్​ (టీవోఆర్​)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇటీవలే ఏపీ ప్రతిపాదనలు పంపింది. 

దానిపై మంగళవారం (june 17) కేంద్ర పర్యావరణ శాఖ ఎక్స్​పర్ట్​ అప్రైజల్​ కమిటీ (ఈఏసీ) మీటింగ్​లో చర్చించినట్టు తెలిసింది. ఏపీ ఇచ్చిన ప్రాజెక్ట్​ ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్​ఆర్​) పై చర్చించిన కమిటీ.. ఆ మేరకు సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విస్తరణపై ఇప్పటికీ పర్యావరణ అనుమతులు పెండింగ్​లో ఉన్నాయని, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దంటూ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం లేఖరాసింది. అయినా కూడా కేంద్రం ఏకపక్షంగా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు లైన్​ క్లియర్​ చేయబోతున్నట్టు తెలిసింది. 


డీపీఆర్​ ముందే సమర్పించారా..?

ఈఏసీ మీటింగ్​లో ఓ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించాలంటే డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్టు (డీపీఆర్​)ను సమర్పించాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈఏసీ మీటింగ్​కు కనీసం 45 రోజుల ముందే డీపీఆర్​ను సమర్పించాక.. దాన్ని సెంట్రల్​ వాటర్​ కమిషన్​ పరిశీలించిన తర్వాత ఈఏసీలో చర్చిస్తారని అంటున్నాయి.

 కానీ, ఇక్కడ మాత్రం ఏపీ ప్రతిపాదనలు పంపిన కొద్ది రోజులకే ఈఏసీలో  చర్చించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఎఫ్​ఆర్​ను ఆమోదించిన తర్వాత డీపీఆర్​ను సమర్పించాల్సి ఉంటుందని ఏపీ చెప్తున్నా.. ఇప్పటికే డీపీఆర్​ను కేంద్రానికి ఏపీ సమర్పించి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కేంద్రం ఈఏసీలో బనకచర్ల ప్రాజెక్టు అనుమతులపై చర్చించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.