మరో ఐదు నెలల తర్వాత వచ్చేది బీజేపీ సర్కారేనన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బీజేపీ అధికారంలోకి వచ్చాక పోలీసులకు సరెండర్ లీవ్ లతోపాటు టీఏలు, ప్రమోషన్లు ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఎందుకు జరుపుతుందో చెప్పాలన్నారు. వడ్లను కొనుగోలు చేసినా ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వం పైసలివ్వలేదని విమర్శించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేసీఆర్ కు రైతులను ఆదుకోవట్లేదన్నారు. రైతులను నట్టేట ముంచిన కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ గప్పాలు కొడుతున్నారన్నారు.
దళితబంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకుంటే... కేసీఆర్ కుటుంబం మరో 30 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు బండి సంజయ్.. కారు- సారు, కేసీఆర్ ది 60 పర్సంట్ సర్కార్ అని అన్నారు. అయినా సిగ్గు లేకుండా తెలంగాణ రన్ నిర్వహిస్తున్న కేసీఆర్ ను రైతులే ఉరికించి కొట్టేరోజులు రాబోతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ మోర్చా నేతలపై ఉందన్నారు బండి సంజయ్. రాబోయే 20 రోజులు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.