నల్గొండ, వెలుగు: వ్యవసాయదారులు, గ్రామీణ కార్మికులు, అధికారిక పెన్షన్ సదుపాయం లేని చిన్న వ్యాపారవేత్తలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్పీఎస్ సంచయ్ అనే సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎస్బీఐ డీజీఎం ప్రియబ్రత మిశ్రా స్పష్టం చేశారు.
ఎన్పీఎస్ సంచయ్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, నల్గొండ లీడ్ బ్యాంక్ కార్యాలయం కలిసి శుక్రవారం నల్గొండ పట్టణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత, గ్రామీణ రంగాల ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంపొందించడం, వారికి వృద్ధాప్యంలో సామాజిక భద్రతను అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న బ్యాంకు సిబ్బంది చొరవ తీసుకుని అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు.
