కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర..పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు

కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర..పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుట్ర చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చాలా మంది కేసీఆర్‌ తో  టచ్‌లో ఉన్నారని, కాంగ్రెస్‌ పార్టీలో కేసీఆర్‌ కోవర్టులున్నారని సంజయ్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చే ప్రమాదముందని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చన్నారు.  కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ అని చెప్పారు.  

తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.    కరీంనగర్ లోని ఎంపీ ఆఫీస్ లో మానకొండూరుకు చెందిన ఇతర పార్టీల నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన  తెలంగాణ అభివృద్ది కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన అవసరముందన్నారు.  బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు.