రైతులకు సారీ చెప్పాకే కేసీఆర్ కరీంనగర్ రావాలి : సంజయ్

రైతులకు సారీ చెప్పాకే కేసీఆర్ కరీంనగర్ రావాలి : సంజయ్
  • నిరుడు పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇయ్యలే

కరీంనగర్, వెలుగు :  మాజీ సీఎం కేసీఆర్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, కరీంనగర్ రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే ఈ గడ్డపై అడుగుపెట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో సీఎం హోదాలో కేసీఆర్ ‌‌రామడుగుకు వచ్చి పంటనష్ట పరిహారం ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ డబ్బులు ఇప్పటికీ రాలేదని గుర్తు చేశారు.

కరీంనగర్ లోని శుభ మంగళ గార్డెన్ లో సోమవారం నిర్వహించిన ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి, రైతులకు భరోసా కల్పించడానికి మంగళవారం కరీంనగర్ లో రైతు దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులకు అండగా నిలవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేస్తే ఉరేనని కేసీఆర్ రైతులను గోస పెడితే ముందుండి కొట్లాడింది తమ పార్టీయేనని గుర్తు చేశారు.