కేసీఆర్ గడీని బద్దలుకొడ్తం

కేసీఆర్ గడీని బద్దలుకొడ్తం

బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో ప్రసంగిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి మోడీ చేసిన సేవలను కొనియాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ప్రధాని మోడీపై కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు తప్పుడు భాషను వాడుతుంటే చూస్తూ కూర్చోవాలా ? అని ఆయన ప్రశ్నించారు.  ‘‘ ప్రజల మనిషి మోడీని టీఆర్ఎస్ వాళ్లు ఎందుకు తిడుతున్నరు. పేదలు ఆకలితో అలమంటిచొద్దని చెప్పి.. ఉచిత బియ్యం ఇస్తున్నందుకు తిడుతున్నరా ? 200 కోట్ల టీకా డోసులను దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చినందుకు తిడుతున్నరా ? ఉక్రెయిన్ లో భారతీయులు, తెలుగువాళ్లు ఇరుక్కుపోతే.. యుద్ధాన్ని ఆపించి మరీ, తెలుగు  రాష్ట్ర యువతను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చినందుకు తిడుతున్నరా ?’’ అని సంజయ్ భావోద్వేగంగా చెప్పారు.

‘‘ఒక్కసారి ఆ మహానుభావుడు మోడీకి ఘనంగా స్వాగతం పలికితే.. గడీలో బందీగా మారిన తెలంగాణ తల్లి పులకరించిపోతుంది. తెలంగాణ తల్లికి  ధైర్యం వస్తుంది. బీజేపీ సేన యుద్ధానికి సిద్ధమైందనే సంకేతం వెళ్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అందరూ లేచి నిలబడి జై మోడీ నినాదాలు చేయాలని సంజయ్ కోరగానే.. సభకు హాజరైన బీజేపీ శ్రేణులు, వేదికపైనున్న పార్టీ నాయకులంతా కలిసి నిలబడి ‘జై మోడీ.. జై మోడీ’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ పేదలను ఆదుకున్న దేవుడు మా మోడీ’’ అని అన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా కేసీఆర్ గడీని బద్దలు కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.