వేములవాడ, బాసర ఆలయాలకు ఇస్తానన్న నిధులేవి?: బండి సంజయ్

వేములవాడ, బాసర ఆలయాలకు ఇస్తానన్న నిధులేవి?: బండి సంజయ్
  • కేసీఆరే గోల్​మాల్ గోవిందం 
  • ఇచ్చిన హామీలన్నీ ఏమైనయ్: సంజయ్ 
  • వేములవాడ, బాసర ఆలయాలకు ఇస్తానన్న నిధులేవి? 
  • ధర్మపురి పుష్కరాలకు ఎన్ని నిధులు ఇచ్చిన్రు?  
  • దోచుకున్న సొమ్ముతో దొంగ సారా దందా చేస్తున్నరు 

నిర్మల్, వెలుగు: సీఎం కేసీఆరే గోల్ మాల్ గోవిందం అని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ విమర్శించారు. కేసీఆర్ జగిత్యాలలో మరోసారి ప్రజలను మోసగించే ప్రసంగం చేశారని మండిపడ్డారు. దళిత బంధు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి తదితర హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. పుష్కరాలప్పుడు కనీస సౌలతులు కూడా కల్పించలేదని ఫైర్ అయ్యారు. ధర్మపురి పుష్కరాలకు కేసీఆర్ ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కొండగట్టు ఆలయానికి రూ.100 కోట్లు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఇంతకుముందు వేములవాడ, బాసర ఆలయాలకు ఇస్తానన్న నిధులెవ్వి? అని ప్రశ్నించారు. బుధవారం నిర్మల్ జిల్లాలో సంజయ్ పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా ఖానాపూర్, బాదన్ కుర్తిలో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. ‘‘కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనం దోచుకుంది. దోచుకున్న సొమ్ముతో దొంగ సారా దందా చేస్తోంది. లిక్కర్ కేసులో ఇరుక్కున్న తన బిడ్డ కవితను అరెస్టు చేస్తే, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయంగా లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారు” అని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుట్రను తిప్పికొట్టేందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. కేసీఆర్ యుద్ధం మొదలుపెట్టిండని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసులు, రౌడీ షీట్లు, దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగిరేదాకా పోరాటం చేస్తామన్నారు. దేశం, ధర్మం కోసం పని చేస్తున్న బీఎల్ సంతోష్ జీపై కేసులు పెడతారా? అని మండిపడ్డారు. ఏసీబీ కోర్టు చెంపచెల్లుమనిపించినా కేసీఆర్ కు సిగ్గు రాలేదని ఫైర్ అయ్యారు.   

పేదల భూములు గుంజుకుంటున్నరు.. 

కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చి, పేదల భూములు గుంజుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఫామ్ హౌస్ లో వాడే కరెంటుతో 30 నుంచి 40 గ్రామాలకు కరెంట్​ఇవ్వొచ్చు. ప్రభుత్వం డిస్కమ్​లకు వేల కోట్ల బకాయి ఎందుకు పడిందో చెప్పాలి. ధాన్యం సేకరణకు కేంద్రమే నిధులిస్తోంది. ఇందులో రాష్ట్ర సర్కార్ మధ్యవర్తి మాత్రమే” అని చెప్పారు. కేసీఆర్ పాలనలో నిధుల్లేక గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. నిధులు, బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్య  చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తారని విమర్శించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సభలో బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జ్ రావుల రామనాథ్, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జ్ అయ్యన్న గారి భూమయ్య తదితరులు 
పాల్గొన్నారు. 

నా యాత్రతో కేసీఆర్​కు నిద్ర పడ్తలేదు.. 

తన యాత్రతో కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని సంజయ్ అన్నారు. ఫామ్ హౌస్ లో ఉన్న సీఎంను, రోడ్డు మీదకు తీసుకొచ్చింది తానేనని చెప్పారు. ‘‘కేసీఆర్ ది నోరా? తాటిమట్టా? ఆయన ఎప్పుడేం మాట్లాడుతరో ఎవరికీ తెలియదు. అవుట్ డేటెడ్ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్రం పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెట్టాలని  చూస్తున్నారు. ఎన్నికలు వస్తే చాలు మోటార్లకు మీటర్లు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు” అని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కమీషన్లు కావాల్సిందేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాల్లేక నిరుద్యోగులంతా గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.