అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్ కు లేదు : బండి సంజయ్

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత కేసీఆర్ కు లేదు : బండి సంజయ్

బీజేపీ పోరాటం, ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహా నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధమైందని బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణ పనులను పట్టించుకోపోవడంతో.. తాము ఒత్తిడి తీసుకురావడం వల్లే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. చాలాసార్లు నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్ నిర్మాణ పనులను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తాము (బీజేపీ) వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు బండి సంజయ్. 

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత సీఎం కేసీఆర్ కు లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ దళిత ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. దళిత సమాజాన్ని అడుగడుగునా అవమానించిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఏనాడు హాజరు కాని ముఖ్యమంత్రి కేసీఆర్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కేసీఆర్.. వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే.. దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఎందుకు చేయలేదని, దానిపైనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల భూములను లాక్కునందుకు.. వారికి క్షమాపణలు చెప్పాలన్నారు.

దళిత బంధు పథకం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ దళిత బంధుకు ఎన్ని నిధులు కేటాయించారో..? ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో స్పష్టం చేయాలని కోరారు. గత ఎనిమిదేండ్లుగా అంబేద్కర్ సేవలను, ఆశయాలను గుర్తించని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికల సంవత్సరం సందర్భంగా.. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయాన్ని దళిత సమాజం గుర్తించుకోవాలని కోరారు. ఏనాడు కూడా అంబేద్కర్ ఆశయాలను సమాజానికి వివరించే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేయలేదన్నారు. 

నిరుపేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీని కూడా తొలగించారని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దళితులు వైద్యం చేయించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేయకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదన్నారు. తొమ్మిదేండ్ల తర్వాత కేసీఆర్ కు అంబేడ్కర్ గుర్తొచ్చారా...? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా దళిత సమాజం ఆయన్ను క్షమించదన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆశయాలకు, స్ఫూర్తికి అనుగుణంగా పాలన చేస్తామని చెప్పారు. 

TSPSC పేపర్ లీకేజీ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును పక్కదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. TSPSC పేపర్ లీకేజీ కేసులో తాము (బీజేపీ) వెనకాడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోరాటం ఆగదన్నారు. అన్ని జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు.