
నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములపై బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలోని సర్వే నెంబర్ 543, 544, 969 లోని అటవీ భూమిని వృత్తి విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం కేటాయించాలనే..... రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుమారు 3.373 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. అటవీ భూమిని డీనోటిఫై చేసి కేంద్రం.. రాష్ట్రానికి అప్పగిస్తే ఆ భూమిని కేసీఆర్ స్వార్ధ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం కేటాయించడం చట్ట విరుద్దమన్నారు.
ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రార్థనా స్థలాలకు కేటాయించడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూమిని ఇతర ప్రయోజనాలకు వినియోగించడం చట్ట విరుద్ధమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ అన్నారు. గతంలో వెలువరించిన కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా చించోలిలోని అటవీ భూముల్లో ఈద్గాను నిర్మించడం... న్యాయ వ్యవస్థను అవమానించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించబడిన ఫారెస్ట్ భూములను కేసీఆర్ స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం నీచమైన చర్యని మండిపడ్డారు.
నిరుద్యోగ యువత కోసం కేటాయించిన భూమిని ప్రార్థనా స్థలాలకు కేటాయించడం ఒక పొరపాటు అయితే.. ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం స్వయంగా పూనుకోవడం క్షమించరాని నేరమన్నారు. ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఒక మతానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం కేసీఆర్ స్వార్ధ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఆ భూములను ఈద్గా నిర్మాణానికి కేటాయించడం.. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ ఆ నిర్మాణ పనులను స్వయంగా ప్రారంభించేందుకు మంగళవారం ఆ ప్రాంతానికి వెళుతుండటం బాధాకరమన్నారు.
వృత్తి విద్య, నైపుణ్యం అభివృద్ధి కోసం కేటాయించబడిన భూమిని అదే ప్రయోజనాల కోసం వినియోగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతోపాటు ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజాక్షేత్రంలోనూ మీ ప్రభుత్వం తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నామని తెలిపారు.