లోక్ సభలో బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం..

లోక్ సభలో బండి సంజయ్  భావోద్వేగ ప్రసంగం..

తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నట్టు నిరూపిస్తే తాను  రాజీనామా చేస్తానని ఎంపీ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణలో  24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పిన బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు..దానిని నిరూపించాలని.. లేని పక్షంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజీనామా చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.  లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడారు.  ఈ సందర్భంగాఅవినీతి యూపీఏ కూటమి.. ఇండియాగా ఎలా మారిందో.. ..కుటుంబ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందన్నారు. బీఆర్ఎస్ అంటే  భ్రష్టాచార్‌ రాక్షస సమితి అని చురకలంటించారు. బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్‌ అంటే ఖాసిం చంద్రశేఖర్‌ రిజ్వీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని... అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుమారుడి ఆస్తులు 400 రెట్లు పెరిగాయని ఆరోపించారు.  సీఎం భార్య ఆస్తులు 1800 శాతం పెరిగాయని వెల్లడించారు.   తెలంగాణ రైతుల సగటు ఆదాయం రూ.1,12,236 అయితే..సీఎం కేసీఆర్‌కు  వ్యవసాయం ద్వారా ఆదాయం రూ.కోటి.  కుమారుడి వ్యవసాయ ఆదాయం రూ.59,85,000 ఆదాయం అర్జించారని చెప్పారు. తెలంగాణ  రైతుల ఆదాయం పెరగలేదు కానీ..ముఖ్యమంత్రి కుటుంబం ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిందని ఆరోపించారు. 

కేంద్ర నిధులను దోచుకుంటోంది..

కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద విడుదల చేస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. పీఎంఏవై పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ. 2.50లక్షల చొప్పున  కేంద్ర ప్రభుత్వం అందిస్తే... డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు.  జల్‌జీవన్‌ మిషన్‌ కింద కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   జాతీయ రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదన్నారు.  మణిపుర్‌కు ప్రధాని వెళ్లలేదంటూ గగ్గోలు పెడుతున్న బీఆర్ఎస్ ఎంపీలు..మరి .. తెలంగాణ రైతులు, యువత, ఆర్టీసీ కార్మికులు, ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.  తెలంగాణలో  ఒకటో తేదీకి ఉద్యోగులకు  జీతాలు ఇవ్వట్లేదని... గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య సిబ్బంది జీతాల కోసం ఆందోళన చేస్తున్నారని లోక్ సభలో ప్రస్తావించారు. 
 తెలంగాణలో కాంగ్రెస్‌, ఎంఐఎం,బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. బీజేపీను  నిక్కర్‌ పార్టీ అని కాంగ్రెస్‌ విమర్శించడం దారుణమన్నారు.  లిక్కర్‌ పార్టీతో కాంగ్రెస్‌ కలిసిపోయిందని... ఢిల్లీలో విడివిడిగా ఉన్నట్టు నటిస్తూ.. తెలంగాణలో మాత్రం కలిసిపోతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని..కాబట్టి  కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే అని అని బండి సంజయ్‌ విమర్శించారు.

వీళ్లతో ఏమీ కాదు..

మోదీ సర్కారుపై ‘అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో విపక్షాలకే  క్లారిటీ లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.  రాహుల్ గాంధీ  వ్యవహారం చూసి  ప్రపంచమంతా నవ్వుకుంటోందన్నారు.  ముద్దులు పెడతారు.... ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇస్తారు.. మరోసారి కౌగిలించుకుంటారు... ఒకసారి కన్ను కొడతారు. ఆయన వ్యవహార శైలి చూస్తే గజినీ గుర్తొస్తాడని చురకలంటించారు.  భరతమాతను హత్య చేశారంటున్నారని.... భరతమాత వైపు కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకి బొందపెట్టే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉన్నారని భావోద్వేగంతో అన్నారు.   ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో లేరన్నారు.  ఏ కాంగీ, బెంగాల్‌ కా దీదీ, దిల్లీ కా కేజీ, బిహార్‌ కా జేడీ, తెలంగాణ కా కేడీ... వీళ్లతోని ఏమీ కాదని మండిపడ్డారు. 


తెలంగాణ ఇచ్చిన దేవాలయం..

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం ఈ పార్లమెంట్‌ అని బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు.  నీళ్లు, నిధులు, నియామకాలు, మా పాలన మాకు కావాలని 1400 మంది బలిదానం అయిన తర్వాత సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.  కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలోనే తెలంగాణ కోసం 1,400 మంది అమరులయ్యారని... రివాల్వర్‌తో కాల్చుకున్నారని చెప్పారు.  రైలు వస్తుంటే.... జై తెలంగాణ అని ఎదురెళ్లి ఆత్మబలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అయినా  కాంగ్రెస్‌.... తెలంగాణ ఇవ్వలేదని... ఇదే లోక్‌సభ వేదికగా తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మాస్వరాజ్‌.. ..తెలంగాణ యువకులారా ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారని గుర్తు చేశారు.  ఆ సమయంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న రాష్ట్రాన్ని  ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సుష్మా స్వరాజ్ ప్రకటించారని..కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే తాము  అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం అని ప్రకటించారని గుర్తు చేశారు.  ఆ తర్వాత కాంగ్రెస్‌ బిల్లుపెడితే బీజేపీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.  చిన్న రాష్ట్రాలకు భాజపా అనుకూలమని... 1997లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా బీజేపీ తీర్మానం చేసిందన్నారు బండి సంజయ్.