
- చర్చకు సిద్ధమా?.. కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
- రాష్ట్ర అభివృద్ధి, అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా..?
- వడ్ల కుప్పలపై రైతు చనిపోయే దుస్థితికి కారణమెవరు?
- చార్జీలు పెంచుడే మీ విద్యుత్ రంగ విజయమా?
- సుపరిపాలనే అయితే 50 వేలకుపైగా
- జీవోలను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలే?
- మీ నేతలు అఘాయిత్యాలు చేస్తున్నందుకు మహిళా దినోత్సవం జరుపుకోవాల్నా?
- బాలింతలకు బేడీలేసినందుకు
- గిరిజనోత్సవాలు చేసుకోవాల్నా?
- ద్రోహులతో రాష్ట్రాన్ని పాలిస్తున్నందుకు అమరుల సంస్మరణ దినోత్సవం జరపాల్నా అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘‘తొమ్మిదేండ్ల మీ కుటుంబ పాలనలో బాగుపడ్డదెవరు, దగాపడ్డదెవరు.. అనే దానిపై చర్చకు సిద్ధమా” అని సీఎం కేసీఆర్కు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రగతి, వివిధ రూపాల్లో చేసిన అప్పులపై వైట్ పేపర్ విడుదల చేసే దమ్ముందా అని శనివారం బహిరంగ లేఖలో ఆయన ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ తప్ప కేసీఆర్ సాధించిన ప్రగతి ఏముందని నిలదీశారు. కమీషన్ల కోసం రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో కొత్తగా కనీసం ఒక ఎకరాకు కూడా నీళ్లివ్వని మాట వాస్తవం కాదా అని మండిపడ్డారు. ‘‘మిషన్ కాకతీయ పథకాన్ని కమీషన్ల కాకతీయగా మార్చి దండుకోవడం నిజం కాదా? వడ్ల కుప్పలపై రైతు చనిపోయే దుస్థితికి కారణమెవరు? రైతుబంధు ఇచ్చి మిగతా పథకాలన్ని ఎత్తేసి రైతుల నోట్లో మట్టి కొట్టింది నిజం కాదా? ” అని ప్రశ్నలు కురిపించారు. ‘‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే లాకప్ డెత్లు చేయడమా..? ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, జైళ్లకు పంపడమేనా.. ఇదా మీ ప్రగతి?” అని సంజయ్ నిలదీశారు.
ఉత్సవాలు ఎందుకు?
‘‘మీకు డబ్బా కొట్టేవాళ్లను మాత్రమే కవులు, కళాకారులుగా గుర్తించి పింఛన్లు ఇస్తూ.. వాస్తవాలను ప్రజల ముందుంచుతున్న వారిని పక్కన పెట్టినందుకు సాహిత్య దినోత్సవం జరుపుకుంటున్నారా? ప్రశ్నించే గొంతుకలను అణచివేయిస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నందుకు సురక్షా దినోత్సవం జరుపుకోవాలనుకుంటున్నారా? మహిళలపై అఘాయిత్యాల్లో దక్షిణాదిలోనే తెలంగాణ టాప్లో ఉన్నందుకు.. మహిళలపై బీఆర్ఎస్ నేతలు అఘాయిత్యాలు చేస్తున్నందుకు మహిళా దినోత్సవం జరుపుకోవాలనుకుంటున్నారా?” అని కేసీఆర్ను సంజయ్ ప్రశ్నించారు. ‘‘సర్కారు దవాఖాన్లలో సౌలతుల్లేక బాలింతలు చనిపోతున్నందుకు వైద్యారోగ్య దినోత్సవం జరుపుకుంటున్నారా? పల్లెల, పట్టణాల ప్రగతిని గాలికొదిలేసినందుకు పల్లె, పట్టణ ప్రగతి ఉత్సవాలు జరుపుకుంటున్నారా..? బిల్లులు రాక సర్పంచులు ప్రాణాలు తీసుకుంటున్నందుకు ఉత్సవాలు జరుపుకుంటున్నారా?” అని ఫైర్ అయ్యారు.
‘‘పోడు పట్టాలడిగినందుకు మహిళలని చూడకుండా గిరిజనులను జుట్లు పట్టుకొని ఈడ్చుకెళ్లినందుకు, బాలింతలకు బేడీలేసి పసిపిల్లలతో కలిసి జైలుకు పంపినందుకు గిరిజనోత్సవాలు చేసుకోవాలని చెప్తున్నారా? మిషన్ భగీరథ పేరుతో రూ.40 వేల కోట్లు ఖర్చు పెట్టినా నేటికీ వందల గ్రామాలకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు? శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే పిచ్చి మొక్కలను డివైడర్ల మధ్య నాటి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం, అడవులను నరికి మళ్లీ అక్కడే మొక్కలను నాటాలని చెప్పడమే హరితోత్సవాల లక్ష్యమా?” అని నిలదీశారు. రాష్ట్రంలో 29 వేల బడుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పురుగుల అన్నమే దిక్కని చాటి చెప్పేందుకే విద్యా దినోత్సవం జరుపుకోవాల్నా? రాష్ట్రంలో ఏ ఆలయానికి వెళితే ఆ ఆలయాన్ని వందల కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దుతామని, దేవుళ్లకే శఠగోపం పెట్టినందుకు ఆధ్యాత్మిక దినోత్సవాలు జరుపుకోవాల్నా? అమరుల త్యాగాలతో సిద్ధించిన తెలంగాణలో వారి కుటుంబాలను గాలికొదిలేసి ఉద్యమ ద్రోహులతో రాష్ట్రాన్ని పాలిస్తున్నందుకు అమరుల సంస్మరణ దినం జరుపుకోవాలా?” అని దశాబ్ది ఉత్సవాల తీరుపై కేసీఆర్ను బండి సంజయ్ ప్రశ్నించారు.
మన్సుఖ్తో సంజయ్, ప్రేమేందర్ భేటీ
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కలిశారు. శనివారం హైటెక్స్లోని నొవోటెల్లో ఉన్న ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా కప్పి సన్మానించారు. జీ20 సన్నద్ధ సమావేశాల్లో భాగంగా మాండవీయ హైదరాబాద్ వచ్చారు. జీ20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ మూడో మీటింగ్ ఆదివారం నుంచి మూడ్రోజులు జరగనుంది. సమావేశాల్లో భాగంగా అత్యవసర సమయాల్లో సన్నద్ధత, ఫార్మా రంగంలో సహకారాన్ని బలోపేతం చయడం, డిజిటల్ హెల్త్ ఇన్నొవేషన్ వంటి విషయాలపై చర్చిస్తారు.
సంక్షోభంలోకి డిస్కంలు
కరెంట్ చార్జీలను పెంచడమే కాకుండా ఏసీడీ చార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరుతో జనంపై కేసీఆర్ సర్కార్ భారం మోపిందని సంజయ్ తెలిపారు. ఇలా భారం మోపడమే విద్యుత్ రంగంలో కేసీఆర్ సాధించిన విజయమా అని ప్రశ్నించారు. ‘‘ఉచిత కరెంట్ పేరుతో డిస్కంలను సంక్షోభంలో నెట్టింది నిజం కాదా? పారిశ్రామిక రంగంలో అద్భుత ప్రగతి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మీరు విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఎందుకు విఫలవుతున్నరు? మీ పాలనలో ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి? ఎంతమంది ఉపాధి కోల్పోయారు? కొత్తగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?” అని ప్రవ్నించారు. సారు.. కారు.. 60 పర్సంట్ సర్కార్ ఎవరిది? దళితబంధులో ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్ తీసుకున్న అవినీతి ప్రభుత్వం మీది కాదా?” అని కేసీఆర్కు రాసిన లేఖలో సంజయ్ ప్రశ్నించారు. నిజంగా సుపరిపాలనే అయితే 50 వేలకుపైగా జీవోలను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడుతలేరని నిలదీశారు.