సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గత 27 రోజులుగా సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ ఆసాములు, కార్మికులు చేస్తున్న సమ్మె అంశాన్ని సంజయ్ లేఖలో ప్రస్తావించారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సిరిసిల్ల నేతన్నలు చేస్తున్న సమ్మెను విరమింపజేయాలని సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.270 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే కొత్త ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్. పవర్ లూమ్ ఖర్ఖానాలకు 50 శాతం విద్యుత్ సబ్సిడీలను పునరుద్దరించాలని కోరారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని తక్షణమే ప్రారంభించాలని లేఖలో వెల్లడించారు సంజయ్. కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలని బండి సంజయ్ లేఖలో సీఎంను కోరారు.