
- 2023లో అధికారంలోకి వచ్చేది పేదల ప్రభుత్వమే
- రైతులు, నిరుద్యోగులు, కుల సంఘాల నేతలతో బండి సంజయ్
- ఆరో రోజు పాదయాత్రలో అన్ని వర్గాలతో మాటామంతి
- చేవెళ్ల నుంచి వికారాబాద్ జిల్లాకు చేరుకున్న ప్రజా సంగ్రామ యాత్ర
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని, ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా తాముంటామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భరోసా ఇచ్చారు. 2023లో అధికారంలోకి వచ్చేది పేదల ప్రభుత్వమేనని, అప్పుడు కష్టాలు, సమస్యలు, బాధలు అన్ని తీరుతాయని చెప్పారు. ‘‘మరో రెండేళ్లు ఓపిక పట్టండి.. మీరు కోరుకున్న పథకాలు, మీరు అనుకున్న అభివృద్ధి జరుగుతుంది” అని అన్నారు. ఆరో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్ గురువారం చేవెళ్ల మోడల్ కాలనీ నుంచి తన యాత్ర ప్రారంభించారు. మిర్జాగూడ, దామరగిద్ద, ఖానాపూర్ మీదుగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని చిట్టంపల్లి గేట్ వద్దకు చేరుకుంది. అక్కడే సంజయ్ బస చేశారు. గురువారం 10 కిలో మీటర్లు నడిచారు.
కులవృత్తులను ఆదుకుంటాం
యాత్ర ప్రారంభం కావడానికి ముందు మున్నూరు కాపు, గౌడ, యాదవ సంఘం నేతలు సంజయ్ ని కలిశారు. కుల వృత్తులను ఆదుకుంటామని, వారికి అండగా ఉంటామని సంజయ్ భరోసా ఇచ్చారు. తమ మద్దతు సంజయ్కేనని కుల సంఘాల నేతలు చెప్పారు. యాత్ర సందర్భంగా దారి పొడవునా.. రైతులతో సంజయ్ మాట్లాడారు. ఏ పంట సాగు చేస్తున్నారు, పెట్టుబడి ఎంత, దిగుబడి ఎంత వస్తుంది, మార్కెట్ లో పంటలకు డిమాండ్ ఎలా ఉంది.. అంటూ వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. తామే పండించి, రోడ్డు పక్కన అమ్ముకుంటున్న రైతులతో సంజయ్ మాట్లాడారు. రుణమాఫీ అమలవుతోందా, పింఛన్ వస్తోందా అంటూ ఆరా తీశారు. నిరుద్యోగ యువతతో మాట్లాడారు.
మా పార్టీ ఆఫీసులకు భూమి ఎందుకు ఇయ్యలే: మనోహర్ రెడ్డి
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు జనం నుంచి వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ ప్రభుత్వ పీఠం కదులుతోందని పాదయాత్ర ఇన్చార్జ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ లో సంజయ్ పాదయాత్ర లంచ్ బ్రేక్ టైంలో మీడియాతో మనోహర్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు తమ ప్రభుత్వం భూమి ఇచ్చిందని.. కానీ ఇక్కడ బీజేపీ కార్యాలయాల కోసం భూమి కావాలని దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. యాత్రలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, నేతలు ప్రదీప్, బంగారు శ్రుతి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు వింటూ ముందుకు..
ఐదు రోజులుగా ఒకటి, రెండు సభల్లో మాట్లాడుతూ వెళ్తున్న సంజయ్.. ఆరో రోజు ఎక్కడా సభల్లో పాల్గొనకుండా జనం సమస్యలు వింటూనే యాత్ర సాగించారు. భువనగిరి, నారాయణపేట్, దుబ్బాక, కొడంగల్ నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు సంజయ్ ని కలిసి బీజేపీ కండువా కప్పుకున్నారు. కార్యకర్తలు, నాయకులు అడుగడుగునా సంజయ్కి స్వాగతం పలికారు. చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కాషాయమయమైంది. ఎటు చూసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, తోరణాలతో కళకళలాడింది.