ఆగష్టు 24 నుంచి బండి సంజయ్  ‘ప్రజా సంగ్రామయాత్ర’

ఆగష్టు 24 నుంచి బండి సంజయ్  ‘ప్రజా సంగ్రామయాత్ర’

చార్మినార్: తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ పాదయాత్ర పేరును ‘ప్రజా సంగ్రామయాత్ర’గా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఈ కార్యక్రమ వివరాలు తెలిపారు. ఈ పాదయాత్ర ఈ నెల 24 నుంచి ప్రారంభంకానున్నట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ యాత్ర విజయవంతం కోసం 29 కమిటీలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. 

‘కేసీఆర్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. ప్రజలను మోసం చేశారు. ఈ మోసాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తాం. ప్రస్తుతం టీఆర్ఎస్ కు ఎదురు నిలిచే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. ప్రజలలోకి ఈ విషయాన్ని తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యం. తెలంగాణాను అప్పుల తెలంగాణాగా ఎలా మార్చారో ప్రజలకు వివరించబోతున్నాం. తెలంగాణలో 2023లో పేద ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇది నేను చెప్పడంలేదు. ప్రజలు అనుకుంటున్న విషయం మీకు చెప్తున్నాను’ అని రాజాసింగ్ అన్నారు.

ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు.. మాజీ మంత్రులు చంద్రశేఖర్, బాబుమోహన్, బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, స్వామి గౌడ్, గంగిడి మనోహర్ రెడ్డి, తూళ్ల వీరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.