ఆధారాలుంటే ఇవ్వండి.. చ‌ర్య‌లు తీసుకుంటాం: రేవంత్ వ్యాఖ్యలపై సంజయ్

ఆధారాలుంటే ఇవ్వండి.. చ‌ర్య‌లు తీసుకుంటాం: రేవంత్ వ్యాఖ్యలపై సంజయ్

కరీంనగర్: హైడ్రో క్లోరోక్విన్ మెడిసిన్ విష‌యంలో ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై కరీంనగర్ ఎంపీ,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. బీజేపీ మీద ఆరోపణలు చేసే వ్యక్తులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామం లో సంజ‌య్ ప‌ర్య‌టించారు. ఇటీవల అకాల వర్షానికి నష్టపోయిన మామిడి పంటల‌ను ఆయ‌న‌ పరిశీలించారు. ఈ క్ర‌మంలో కేటీఆర్ బావ‌మ‌రిది పాకాల రాజేంద్ర ప్ర‌సాద్ డైరెక్టర్‌గా ఉన్న ఓ ఫార్మా కంపెనీకి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింద‌న్న రేవంత్ వ్యాఖ్య‌ల‌పై సంజ‌య్ స్పందించారు.

ఆ సంస్థ విష‌యంలో అవినీతి , అక్ర‌మాలు జరుగుతున్నాయని ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలన్నారు సంజ‌య్. ఆధారాలతో సహా పిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామ‌న్నారు. కేంద్రం తరపున విచారణ జ‌రిపిస్తామ‌న్నారు. ఏ ఆధారాలు ఉన్నా ఇవ్వాల‌ని, చర్యలు తీసుకునే విష‌యంలో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. ఇక‌ బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటా? కాదా? అనేది ప్రజలు గుర్తిస్తూనే ఉన్నార‌న్నారు.