ఎన్ని పార్టీలొచ్చినా బీజేపీని ఏం చేయలేవు

ఎన్ని పార్టీలొచ్చినా బీజేపీని ఏం చేయలేవు
  • బీజేపీ అధికారంలోకి  రాగానే 69 జీవో అమలు చేస్తం

నారాయణపేట, మక్తల్, ఊట్కూర్, వెలుగు: బీజేపీని ఎలాగైనా ఓడించాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి పోటీకి వస్తున్నాయని.. ఎన్ని గుంటనక్కల పార్టీలు వచ్చినా వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్​అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 14వ రోజు మక్తల్ మండలం లింగంపల్లి నుంచి ఊట్కూర్ మండల కేంద్రం వరకు పాదయాత్ర కొనసాగింది. ఊట్కూర్​లో జరిగిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. ఊట్కూర్ యువత చత్రపతి శివాజీ వారసులని అన్నారు. వినాయక నిమజ్జనం రోజు ఊట్కూర్లో జరిగింది వింటే గుండె తరుక్కపోతుందన్నారు. ఊట్కూర్, భైంసాల కోసమే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. నిఖార్సయిన హిందువునని బూతు పేపర్​లో ప్రకటనలు వేయించుకున్న సీఎం.. రాష్ట్రంలో హిందువులపై దాడులు చేస్తున్నాడన్నారు. ఊట్కూర్ వినాయక నిమజ్జనంలో జరిగిన ఘటనపై 100మంది సేవకులు, 30మంది హిందూ యువకులపై రౌడిషీట్​లు ఉన్నయంటే సమాజం ఆలోచించాలన్నారు. గ్రామం మీదపడి వేధించిన పోలీసు అధికారులను.. వారు రిటైర్ అయినా సరే విడిచిపెట్టే ప్రసక్తేలేదన్నారు. తాను బరాబర్ హిందూత్వం గురించి మాట్లాడుతానన్నారు. ఊట్కూర్, భైంసా, భాగ్యలక్షి ప్రాంతాలను దత్తత తీసుకుంటానన్నారు. తెలంగాణ కోసం ప్రజలు ఆత్మబలిదానాలు చేసుకుంటే, కేసీఆర్ మాత్రం దొంగ దీక్షలు చేశారన్నారు. ఓట్ల కోసం కేసీఆర్ ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాడన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీ పుంజుకుంటున్నదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే జీవో 69ను అమలు చేసి తీరుతామన్నారు.