
మునుగోడు ఉప ఎన్నికలో గెలవడానికి కేసీఆర్ అండ్ టీం ఆడిన డ్రామా ఫెయిల్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ గత 8 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలు, అక్రమాలను వివరిస్తూ ఆయన ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ‘‘ కేసీఆర్ స్క్రిప్ట్ రాసింది వేరే.. నిన్న లొకేషన్ లో జరిగింది వేరే. ఎమ్మెల్యేలను సరిగ్గా ప్రిపేర్ చేయించలేదనుకుంటా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఎమ్మెల్యేల స్టేట్మెంట్ రికార్డు చేయకుండా పోలీసులు నేరుగా ప్రగతి భవన్ కు ఎలా పంపారు ? ఎందుకు పంపారని ప్రశ్నించారు. ఇదంతా జరిగాక భయపడ్డ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడలేదని. బహుశా వాళ్లు నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి రిహార్సల్స్ చేసి ఉంటారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇయ్యాలో రేపో వాళ్లతో ప్రెస్ మీట్ పెట్టించి అబద్ధమాడిస్తరు’’ అని చెప్పారు. మునుగోడు క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హైడ్రామా వ్యవహారానికి సంబంధించి కొత్త కొత్త వీడియోలు, ఆడియోలను తయారు చేస్తున్నరని తెలిసిందన్నారు. ఎఫ్ఐఆర్ లో బీజేపీ ప్రస్తావన ఉందనే విషయం కేవలం ఆ రెండు చానళ్లలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ‘‘ ఈ పొలిటికల్ డ్రామా కోసం ఆ పోలీస్ కమిషనర్ ఏరియానే ప్రత్యేకంగా ఎంచుకున్నరు. ఆ కమిషనర్ దీని నుంచి తప్పించుకోగలడా ? ఈ వ్యవహారం జరిగిన లొకేషన్ లో ఒక ఏసీపో.. డీపీపో మాట్లాడిన మాటలను ప్రసారం చేయొద్దని కొన్ని టీవీ చానళ్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో వాటిని ప్రసారం చేయలేదు’’ అని బండి సంజయ్ వివరించారు. ‘‘ ఎమ్మెల్యే బంధువు కారులోనే బ్యాగులు ఉన్నాయి. వాటిలో పైసలున్నయో.. ఏమున్నయో మీడియాకు చూపించాల్సిన అవసరం ఉంది’’ అని డిమాండ్ చేశారు. ఫిల్మ్ నగర్ లోని దక్కన్ కిచెన్ సెంటర్, ఎమ్మెల్యేల హైడ్రామా జరిగిన ఫామ్ హౌజ్ ల సీసీ ఫుటేజీలను తీస్తే బండారమంతా బయటపడుతుందన్నారు. సీపీ ఫోన్ కాల్ లిస్ట్, ముఖ్యమంత్రి కేసీఆర్ ల్యాండ్ లైన్ ఫోన్ కాల్ లిస్ట్ తీస్తే విషయాలు వెలుగులోకి వస్తాయని ఆరోపించారు. టీఆర్ఎస్ చేస్తున్న దిగజారుడు రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కోర్టును కూడా ఆశ్రయిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. ‘‘నేను రేపు ఉదయం 9 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి గుడికి వెళ్తున్నాను. ఎమ్మెల్యేల హైడ్రామాతో సంబంధం లేదనుకుంటే గుట్టకు వచ్చి సీఎం కేసీఆర్ ప్రమాణం చేసి చెప్పాలి. గంటపాటు మీ కోసం ఎదురుచూస్త’’ అని పేర్కొన్నారు.
సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, మునుగోడు బైపోల్ బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.