హుజురాబాద్ పోవుడే.. కేసీఆర్ సంగతేందో చూసుడే

హుజురాబాద్ పోవుడే.. కేసీఆర్ సంగతేందో చూసుడే

సిద్ధిపేట: వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్‎కు.. వరి పండిస్తే కొనేదిలేదని మోడీ కలలోకొచ్చి చెప్పాడా లేక ఫోన్ చేసి చెప్పాడా? అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.  ఆయన వ్యాఖ్యానించారు. సంజయ్ నిర్వహిస్తోన్న ప్రజా సంగ్రామ యాత్ర బెజ్జంకి మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఓ బ్రోకర్ మాత్రమే
‘కేసీఆర్ మాటలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన ప్రతి గింజను కొంటానని కేసీఆర్ గతంలో చెప్పలేదా? ఇప్పుడు కేంద్రం కొనడం లేదని చెబుతున్నాడు. ధాన్యం కొనుగోలులో కేసీఆర్ పాత్ర ఏమీ లేదు. ఆయన ఓ బ్రోకర్ మాత్రమే. ఆయనను మధ్యవర్తి అంటే అర్థం కాదు.. బ్రోకర్ అంటేనే అర్థమవుతుంది. ఆయన భాషలోనే చెప్పాలి. ఒకప్పుడు పాస్‎పోర్టు బ్రోకర్ పని చేసిన వ్యక్తి కేసీఆర్. బెజ్జంకి లక్ష్మి నర్సింహస్వామికి రూ. 17 కోట్లు ఇస్తానని మాట తప్పాడు. దేవుడికే శఠగోపం పెట్టినోడు.. మీకు దళితబంధు ఇస్తాడా? కన్నతల్లికి తిండిపెట్టనోడు.. పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట. కరీంనగర్ జిల్లాలో ఉన్న బెజ్జంకిని సిద్ధిపేట జిల్లాలో కలిపి అన్యాయం చేశాడు. మొన్న ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ధాన్యం కొనేలా కేంద్రాన్ని ఒప్పించానని చెప్పుకుంటున్నాడు. గతంలో సన్నవడ్లు పండించాలని రైతులకు చెప్పిన కేసీఆర్.. తాను మాత్రం ఫామ్ హౌస్‎లో దొడ్డు వడ్లు పండించాడు. 60 లక్షల క్వింటాళ్ల బియ్యం కొంటానని కేంద్రం చెప్పింది. ధాన్యం కొనుగోళ్లపై చర్చకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం పిలిస్తే కేసీఆర్ పోలేదు. ఆయనకు ఇక్కడ ఏం పని ఉందని ఆక్కడికి పోలేదు. యూపీ ముఖ్యమంత్రి యోగి లాంటి వాళ్లు వెళ్లి బియ్యం ఇతర దేశాలకు అమ్ముకునే అగ్రిమెంట్ చేసుకుంటే.. మన ముఖ్యమంత్రి పోలేదు. కేసీఆర్ మెడలు వంచి.. ప్రతి గింజను కేసీఆర్‎తో కొనెలా చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఒప్పిస్తా. ధాన్యం కొనేదిలేదని మోడీ ఎప్పుడూ చెప్పలేదు. టీఆర్ఎస్ పాలన వచ్చాక ఏడేళ్లలో పంటలు నష్టపోయిన ఒక్క రైతుకు పరిహారం ఇవ్వలేదు. అలాంటి ఇబ్బందులు ఉండకూడదనే.. మోడీ ఫసల్ బీమా పథకం తెస్తే ఇక్కడ అమలు చేయడం లేదు. ఓవైపు తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని చెబుతూనే.. మరోవైపు ఆయన అనుచరులతో నకిలీ విత్తనాలు అమ్మిస్తున్నారు. రైతుబంధు ఇచ్చి.. రైతులకు రావాల్సిన అన్నింటిని బంద్ చేశాడు. 2.91 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం కేంద్రం నిధులు ఇస్తే.. వాటిని పేదలకు కేసీఆర్ ఇవ్వలేదు. కేవలం 12 వేల ఇండ్లు మాత్రమే కేసీఆర్ ఇప్పటి వరకు కట్టాడు. తెలంగాణ ప్రజలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు తెద్దాం.. ఢిల్లీకి రమ్మంటే ఫామ్ హౌస్ దాటి రావడం లేదు. ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తే మోడీకి పేరు వస్తుందని కేసీఆర్ భయపడుతున్నాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. కేవలం వాళ్ల ఇంటి సభ్యులకే పదవులు ఇప్పించుకున్నాడు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. అందరినీ తొలగిస్తున్నారు.  ప్రజాస్వామిక తెలంగాణ కోసం బీజేపీ కృషి చేస్తుంది. 

హుజురాబాద్ పోవుడే.. కేసీఆర్ సంగతేందో చూసుడే

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ అక్టోబర్ 2వ తేదీన హుజురాబాద్‎లో ఉంటుంది. ఆ రోజు హుజురాబాద్ పోవుడే.. కేసీఆర్ సంగతేందో చూసుడే. గతంలో కాంగ్రెస్‎తో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ పార్టీతో కలవదు. మోడీతో ఐదు నిమిషాలు మాట్లాడి 40 నిమిషాలు మాట్లాడినట్లు వార్తలు రాయించుకున్నాడు. ఎక్కడ వరదలొచ్చినా కేసీఆర్, కేటీఆర్ ఎవరూ రావడం లేదు. సిరిసిల్లలో కూడా వరదలొస్తే పట్టించుకోవడం లేదు. నీ ప్రభుత్వాన్ని దించేదాకా విశ్రమించను. నేను పేదప్రజలకు అంబాసిడర్‎గా ఉంటా. పంటనష్టం అందేదాకా, రుణమాఫీ ఇప్పించేదాకా, మూడెకరాలు దళితులకు ఇచ్చేదాకా నేనే అంబాసిడర్‎గా ఉంటా. కేసీఆర్ ఏం త్యాగం చేశాడని ఆయనకు మళ్లీ అధికారం ఇవ్వాలి. పేదవర్గాలవారు త్యాగం చేస్తే.. ఈ మూర్ఖులు రాజ్యమేలుతున్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు గానీ.. తాను మాత్రం 100 గదుల ఇంట్లో ఉంటున్నాడు. బర్రెలు, గొర్రెలు తీసుకుని ఎవరైనా కోటీశ్వరులయ్యారా? ఇప్పుడు కోళ్లు ఇస్తాడట. నల్గొండ జిల్లాలో బెల్ట్ షాపుల వల్ల ఓ మహిళపై అత్యచారం జరిగింది. చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వైన్సుల ద్వారా తెలంగాణకు వచ్చే ఆదాయం 30 వేల కోట్లు. ఆదాయం కోసం మందు తాగితేనే... మీకు పథకాలు ఇస్తానంటాడు. ఒవైసీ ప్రాంతంలో కషాయం జెండా పట్టుకొని తిరిగాం. కేసీఆర్ మాత్రం ఓవైసీకి భయపడుతున్నాడు.

టీఆర్ఎస్ డిపాజిట్ కోసం తండ్లాడుతోంది
ఇవాళ ఎన్నికల షెడ్యూలు వచ్చింది. హుజురాబాద్ పక్కా మేమే గెలుస్తాం. టీఆర్ఎస్ డిపాజిట్ కోసం తండ్లాడుతోంది. దళితబంధు కేవలం హుజురాబాద్‎లో ఇస్తారట. అందరికీ ఇవ్వాల్సిందే. మానకొండూరు నియోజకవర్గంలో కూడా పేద దళితులకు రూ. 10 లక్షలు ఎందుకు ఇవ్వడం లేదు. కేంద్రం నిధులు ఇస్తే.. కేసీఆర్ భోగాలు అనుభవిస్తున్నాడు. ఓ మూర్ఖ ప్రభుత్వం తెలంగాణలో రాజ్యమేలుతుంటే.. ప్రజాస్వామిక తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేస్తోంది. పేదల ప్రభుత్వం కోసం చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రకు మద్ధతు ఇస్తున్న మీకు ధన్యవాదాలు’ అని బండి సంజయ్ అన్నారు.

For More News..

దారుణం.. అత్త వేధింపులకు అల్లుడు బలి

పింఛన్ రావాలంటే ఇంటిమీద గులాబీ జెండా పెట్టుకోవాలట

కోచింగ్ లేకుండా ఐపీఎస్ నెగ్గిన 22 ఏళ్ల కుర్రాడు

దిశను మార్చుకున్న గులాబ్ తుఫాన్..