కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తుండు: బండి సంజయ్

కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తుండు: బండి సంజయ్

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రాజు లెక్క వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‭ను బద్నాం చేస్తున్నారని.. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‭ను పిలిస్తే కేసీఆర్‭కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ విషయంలో హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసినా కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అలాగే వ్యవహరిస్తోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సమయం ఉన్నప్పటికీ.. కావాలనే కోర్టుకు వెళ్లిందని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఫైల్ ఎంతవరకు వచ్చిందో శాసనసభ స్పీకర్ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయని వాటిని పక్కనపెట్టి.. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్ సర్కార్ తీరుతో తెలంగాణలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. స్టీల్ ఫ్యాక్టరీ డీపీఆర్ ఇవ్వటం లేదని కేంద్రమే స్వయంగా చెబుతోందన్నారు. మరోవైపు ఎసై, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు తప్పులు తడకగా ఉన్నాయని విమర్శించారు. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పుడు ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ప్రజా‌ సమస్యలపై ప్రశ్నిస్తున్నందునే ఎంపీ అర్వింద్ పై ప్రభుత్వం కక్ష కట్టిందని బండి ఆరోపించారు. బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ పై పోలీసులే విచక్షణారహితంగా దాడి చేశారని బండి సంజయ్ విమర్శించారు.