వీఆర్‍ఏల దీక్షకు మద్దతు తెలిపిన బండి సంజయ్

వీఆర్‍ఏల దీక్షకు మద్దతు తెలిపిన బండి సంజయ్
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 

కరీంనగర్‍సిటీ/కొత్తపల్లి, వెలుగు: సీఎం కేసీఆర్‍ పచ్చి అబద్ధాలకోరని, మోసపూరితమైన హామీలతో కాలం గడుపుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‍ ఎంపీ బండి సంజయ్‍కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్‍ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలనే డిమాండ్‍తో  కలెక్టరేట్‍ వద్ద మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్‍ఏలకు శుక్రవారం బండి సంజయ్​మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పే స్కేల్‍ జీవోను వెంటనే విడుదల చేసి  ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‍ చేశారు. ఆందోళన చేస్తున్న వీఆర్ఏలను కాల్చిపారేస్తానన్న సీఐని సస్పెండ్ చేయాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం తెగించి కొట్లాడండి.. మీకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. కరీంనగర్​ఫిలిం భవన్​లో ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో మూడు నెలలపాటు నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పోటీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి బండి సంజయ్​హాజరై స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోవడంతో విఫలమైనా అధైర్యపడవద్దని, ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని భరోసా కల్పించారు. కొత్తపల్లి మండలం కమాన్​పూర్, ఎలగందల్, చింతకుంటల్లో ఈజీఎస్ కింద మంజూరైన రూ.23 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. కమాన్​పూర్​లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద మంజూరైన గ్యాస్ సిలిండర్లను ఎంపీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కార్పొరేటర్‍ చొప్పరి జయశ్రీ తదితరులు ఉన్నారు.