బీఆర్ఎస్​ది పూటకో మాట.. రోజుకో హామీ : బండ్ల గణేశ్

బీఆర్ఎస్​ది పూటకో మాట.. రోజుకో హామీ :   బండ్ల గణేశ్

అంబర్ పేట, వెలుగు :  బీఆర్ఎస్ నేతలు పూటకో మాట.. రోజుకో హామీ ఇస్తూ పబ్బం గడుపుతున్నారని సినీ నిర్మాత బండ్ల గణేశ్ విమర్శించారు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా మంగళవారం అంబర్​పేట సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డికి మద్దతుగా చేపట్టిన మహా బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెగ్మెంట్​లోని పలు కాలనీలు, బస్తీల్లో ర్యాలీ తీశారు. పేదల అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీనేనని.. హస్తం గుర్తుకు ఓటేసి రోహిన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని బండ్ల గణేశ్ కోరారు.

 ప్రజా సంక్షేమం, సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రోహిన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న మొన్న పుట్టుకొచ్చిన పార్టీలకు ప్రజా సంక్షేమం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన వల్లే దేశం అభివృద్ధిలో ఈ స్థాయిలో ఉందన్నారు.  ఇతర పార్టీల నాయకుల మాటలను నమ్మి మోసపోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.