హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. లోపల ఎలాంటి మెటీరియల్ లేదని.. ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇతర శాఖల అధికారులు సకాలంలో స్పందించినట్టు చెప్పారు.
షాపింగ్ మాల్ లో పని చేసే వర్కర్ ప్రత్యక్ష సాక్షి రాము ఏం చెప్పాడంటే.. ‘అగ్నిప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్ లో నలుగురు పని చేస్తున్నాం. ఫిబ్రవరి 26న ఉదయం11 గంటల సమయంలో అగ్నిప్రమాదంజరిగింది.బిల్డింగ్ పై అంతస్తు నుంచి మంటలు మొదలయ్యాయి. బిల్డింగ్ సెల్లార్ నుంచి మీదకు పరుగులు తీశాం. కాపాడండి అంటూ కేకలు వేశాం. మా బండ్లు కూడా అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. భగవంతుని దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాం. బిల్డింగ్ పైనా కూడా పని జరుగుతుంది అక్కడే మంటలు మొదలయ్యాయి.. కరెంట్ వైర్లు తగిలి ప్రమాదం జరిగిందా ? ఏంటనేది కారణం తెలియదు’ అని చెప్పాడు.
►ALSO READ | జూబ్లీహిల్స్ మంగళగౌరి షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. మాల్ లో చిక్కుకున్న సిబ్బంది, కస్టమర్లు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు నలుగురు వర్కర్లు లోపల ఉన్నారు. అద్దాలు బ్రేక్ చేసుకొని అందరూ బయటకు వచ్చారు. ఈ అగ్నిప్రమాదం ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రాపర్టీ నష్టం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇతర శాఖల అధికారులు సకాలంలో స్పందించారని తెలిపారు.
గురువారం(ఫిబ్రవరి 26) జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న మంగళ గౌరి షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాపింగ్ మాల్ లోపల చెలరేగిన మంటలు బయటికి వ్యాపించి సెట్టింగ్ కు అంటుకొని భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే భవనం మొత్తం బుగ్గయ్యింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకొని మంటలార్పారు. పక్క భవనాలకు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
