ట్రాక్టర్​ కిస్తీలకు పైసల్లేవ్​.. ఈఎంఐలు కట్టాలని గ్రామ పంచాయతీలకు బ్యాంక్​ నోటీసులు 

ట్రాక్టర్​ కిస్తీలకు పైసల్లేవ్​.. ఈఎంఐలు కట్టాలని గ్రామ పంచాయతీలకు బ్యాంక్​ నోటీసులు 

నిర్మల్, వెలుగు:  గ్రామ పంచాయతీలకు నిధుల రాకపోవడంతో లోన్లు పెండింగ్ లో పడుతున్నాయి.  గ్రామ పంచాయతీలకు టాక్టర్ల లోన్లు,  నిర్వాహణ ఖర్చుల భారం వెంటాడుతోంది.  మూడు నెలలుగా టాక్టర్ల కిస్తీలు కట్టకపోవడంతో బ్యాంక్​ ఆఫీసర్లు ఏకంగా జీపీలకు నోటీసులు పంపుతున్నారు.  జిల్లాలో ఇప్పటికే ఐదు గ్రామ పంచాయతీలకు నోటీసులు అందగా..  మరిన్ని జీపీలకు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు గ్రామపంచాయతీలు ట్రాక్టర్లను కొన్నాయి. ఇందుకు బ్యాంక్​ నుంచి టోన్లు తీసుకున్నాయి.  ట్రాక్టర్‌‌‌‌, ట్రాలీలతో పారిశుధ్య నిర్వహణ,   ఇతర గ్రామపంచాయతీ పనులకు  వాడుతుంటారు.  టాక్టర్ల ఈఎంఐలు,  డీజిల్‌‌‌‌ ఖర్చు, రిపేరింగ్​,   డ్రైవర్​ జీతాలు  అన్నీ  పంచాయతీ నుంచే చెల్లించాల్సి  ఉంటుంది.   కానీ నిధులు లేకపోవడంతో కిస్తీలు చెల్లించలేకపోతున్నామని సర్పంచ్​లు అంటున్నారు. 

నిధులు అందక... 


ఇప్పటికే గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు , 15వ ఆర్థిక  సంఘం నిధులు, జనరల్ ఫండ్  సక్రమంగా అందడం లేదు.   ముధోల్ మండలం గన్నోర, మచ్కల్, ఎడ్బిడ్ తండా, వెంకటాపూర్, రువ్వి గ్రామ పంచాయతీలకు   ఎస్బీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు.   .  ట్రాక్టర్ల ఈఎంఐల చెక్కులను  ట్రెజరీకి  పంపారు. అధికారులు వాటిని  ఇ– కుబేర్ లో జమ చేసినప్పటికీ నిధుల   లేకపోవడంతో  చెక్కులు ఆగిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు.  

ఆందోళననలో సెక్రటరీలు


ట్రాక్టర్ల కోసం రుణ  తీసుకునే సమయంలో సంబంధిత గ్రామపంచాయతీ సెక్రటరీలు బ్యాంకులో తమ ఆధార్ కార్డులు,  పాన్ కార్డులను రుణ దరఖాస్తుకు జత చేశారు. దీని ఆధారంగానే ప్రస్తుతం బ్యాంక్ అధికారులు సెక్రటరీలకు  నోటీసులు జారీ  చేస్తున్నారు.  తమ వ్యక్తిగత సిబిల్  తగ్గిపోతే  ఇబ్బందులు పడతామని  ఆందోళన చెందుతున్నారు. 

ట్యాక్స్​లు​ కట్టాలని నోటీసులు

కాగజ్ నగర్, వెలుగు:  కాగజ్​ నగర్​ డివిజన్​లో గ్రామపంచాయతీ టాక్టర్ల రోడ్​ ట్యాక్స్​లు, పెనాల్టీలు కట్టాలని ఇటీవల అధికారులు  నోటీసులు జారీ చేశారు.  రిజిష్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. మార్చ్​ 31వ వరకు గడువు విధించారు.   కానీ,    నిధులు లేక ఆ నోటీసులకు గ్రామ పంచాయతీల నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు కొన్ని  జీపీల్లో టాక్టర్లు దుర్వినియోగం అవుతున్నాయి.     గూడెం  పంచాయతీ టాక్టర్​ను  సర్పంచ్​   సొంత పనులకు వాడుకోవడంతో అడిషనల్ కలెక్టర్ చా హత్ బజ్ పాయ్  మెమో జారీ చేశారు.  మరోవైపు కొన్ని గ్రామాల్లో టాక్టర్లను వినియోగించడం లేదు. రిపేర్లు వచ్చినా చేయించే పరిస్థితి లేకుండా పోయింది.  

మూడు నెలల నుంచి కిస్తీలు కట్టకపోవడంతో నోటీసులు అందుకున్న గ్రామ పంచాయతీలు
గ్రామపంచాయతీ                            నెలకిస్తీ
గన్నోర                                                      రూ50,351
మచ్కల్                                                        రూ.47036,
ఎడ్బిడ్ తండా                                           రూ.24,237
వెంకటాపూర్                             రూ.47,026
రువ్వి                                                             రూ.51,605